ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్ జగన్-big shock for mlc duvvada srinivas ys jagan suspends mlc from ysrcp party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్ జగన్

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్ జగన్

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ… పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ క్రమ శిక్షణను ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదుతో వైసీపీ అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన చేసింది.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్ జగన్

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్ఠానం షాకిచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో...వైసీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ ఓ ప్రకటనంలో తెలిపింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొంది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి వివాదాలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు, అధికారం కోల్పోయాక కుటుంబ వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు దువ్వాడ. భార్య, పిల్లలకు దూరంగా...మరో మహిళతో ఆయన ఉంటున్నారు. తన స్నేహితురాలు దివ్వెల మాధురితో ఉంటున్న దువ్వాడ...తరచూ జంటగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలలో వీరి చేష్టలు కాస్త శృతిమిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

దువ్వాడ శ్రీనివాస్ తాను వివాదాలలో చిక్కుకోవడంతో పాటు పార్టీకి తలనొప్పిగా మారారని ఫిర్యాదులు అందాయి. దీంతో వైసీపీ క్రమశిక్షణ కమిటీ ఈ ఫిర్యాదులపై విచారణ చేసింది. క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు.

ఫేక్ వర్సిటీ నుంచి డాక్టరేట్

ఇటీవల యూజీసీ అనుమతి లేని ఓ ఫేక్ యూనివర్సిటీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ తీసుకున్నారని ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. ఆ వివాదం ముగిసేలోపే విద్యుత్ అధికారులను బెదిరించారని మరో వార్త వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి కరెంట్ బిల్లులు కట్టకపోవడంతో...విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారట, దీంతో ఆ అధికారికి ఫోన్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ నోటికి వచ్చినట్లు ఇష్టారీతిని మాట్లాడారంట. అధికారిని దుర్భాషలాడిన ఆడియో ఇటీవల వైరల్ గా మారింది.

తొలుత ఇన్ ఛార్జ్ బాధ్యతలు తొలగింపు

నిత్యం ఏదొక వివాదంలో చిక్కుకోవడంతో వైసీపీ అధిష్టానంతో పాటు ఆయన అనుచరులకు సైతం ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. నిత్యం వివాదాలు వెంటాడుతుండడంతో పార్టీ అధిష్టానం దువ్వాడపై చర్యలకు దిగింది. కుటుంబ వివాదంతో పార్టీకి భారీగా డ్యామేజీ అవుతుందని భావించిన వైసీపీ ఆయనను టెక్కలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది.

టెక్కలి బాధ్యతలను ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్ కు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి దువ్వాడ శ్రీనివాస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా సొంత వ్యవహారాలనే బిజీగా ఉంటున్నారని సమాచారం.

ఇదిలా ఉండే దువ్వాడ భార్య వాణి....దువ్వాడ శ్రీనివాస్ కు చెక్ పెట్టేందుకు టెక్కలి వైసీపీ ఇన్ చార్జ్ పేరాడ తిలక్ తో కలిసి పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించిన వైసీపీ అధిష్టానం దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై దువ్వాడ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం