వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వల్లభనేనికి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు ఇచ్చింది కోర్టు.
ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో వంశీ ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు రెండు సార్లు బెయిల్ తిరస్కరించింది. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా...ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
వల్లభనేని వంశీపై... గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు...ఇలా మొత్తం ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఐదు కేసుల్లో వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పొందారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇంకా వంశీకి బెయిల్ మంజూరు కాలేదు. ఈ కేసులోనే వంశీ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.
దీంతో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినా, వంశీ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉంది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరి 13న హైదరాబాద్లో వల్లభనేని వంశీ మోహన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ లోనే ఉన్నారు.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు మంగళవారం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తనకు అనారోగ్యంగా ఉందని వంశీ కోర్టుకు విన్నవించుకున్నారు. ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నానని కోర్టుకు వివరించారు.
ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై మెమో దాఖలు చేయాలని అతడి న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. వల్లభనేని వంశీ రిమాండ్ను రేపటి వరకు కోర్టు పొడిగించింది. ఈ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది.
సంబంధిత కథనం