Ys Viveka MurderCase: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్గా అనుమతించడాన్ని సవాలు చేస్తూ వైఎస్.భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో పలు ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది పేర్కొన్నారు. దస్తగిరి అప్రూవర్ను సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు వినిపించారు.
సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురి చేయడంతోనే నిందితుడు సునీల్ యాదవ్ కక్ష కట్టి వివేకా తలపై దాడి చేసి హత్య చేశాడని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసులో ఎస్పీ రాంసింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లారని, రాంసింగ్ వ్యక్తి గతంగా టార్గెట్ చేసి తమను ఇరికిస్తున్నారని నిందితుడు భార్య తులసమ్మ వాదనలు వినిపించింది. దీంతో రామ్ సింగ్ వ్యవహారం పై అనుమానాలు రావడం తో కొత్త దర్యాప్తు అధికారిని సుప్రీం కోర్టు నియమించిందన్నారు. కొత్తగా నియమించిన సిట్ వివరాల ఆర్డర్ కాపీ ఉందా అని వాదనలు విన్న న్యాయస్థానం ప్రశ్నించింది.
నూతనంగా నియమించిన సీబీఐ సిట్ టీమ్ అధికారుల వివరాలను పిటిషనర్ తరుపు న్యాయవాది ఇచ్చారు. గూగుల్ టెక్ ఔట్ను ఆధారంగా చేసుకొని ఎలా తమను కేసులో అనుమానితులుగా పేర్కొంటారని ప్రశ్నించారు. సీబీఐ, సునీత కలిసిపోయి దస్తగిరిని అప్రూవర్గా మార్చారని వాదనల్లో ఆరోపించారు. రెండో భార్య కుమారుడ్ని రాజకీయ వారసుడిగా ప్రకటించడంతో కుటుంబంలో విబేధాలు ఉన్నాయన్నారు
దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి,భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్యకు దస్తగిరి గొడ్డలి కొనుగోలు చేశారని, హత్యచేసిన తీవ్ర అభియోగాలు ఉన్నాయని, అరెస్టు చేయకుండానే ముందస్తు బెయిల్ పొందడానికి సీబీఐ అభ్యంతరం చెప్పకపోవడం చట్ట వ్యతిరేకమని సోమవారం జరిగిన వాదనల్లో నిందితుల తరపు లాయర్లు వాదించారు. ఈ కేసులో భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన కేసులో వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీడ్ అయ్యేందుకు న్యాయమూర్తి అనుమతించారు. కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు.