విశాఖలో బీఈఎల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించింది
విశాఖపట్నం: నవరత్న డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) విశాఖపట్నంలో కొత్త సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ (ఎస్డిసి)ని ప్రారంభించింది. విశాఖపట్నం ఎస్డీసీ డైరెక్టర్ (బెంగళూరు కాంప్లెక్స్) వినయ్ కుమార్ కత్యాల్ దీనిని ప్రారంభించారు. బీఈల్ సాఫ్ట్వేర్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ (ఎస్బీయూ)కు ఇది పొడిగింపుగా ఉంటుంది. రక్షణ, రక్షణేతర డొమైన్లలో వివిధ అప్లికేషన్ల కోసం సాఫ్ట్వేర్ సేవలు అందిస్తుంది. ‘బీఈఎల్ సాఫ్ట్వేర్ విభాగం గత అనేక దశాబ్దాలుగా రక్షణ, ఏరోస్పేస్, ఇ-గవర్నెన్స్, హోంల్యాండ్ సెక్యూరిటీ మొదలైన రంగాలలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసింది’ అని బీఈఎల్ తెలిపింది.
ట్రెండింగ్ వార్తలు
అత్యాధునిక సాంకేతికత, సురక్షితమైన ఐటీ సేవలతో నేవీ రంగంలో కీలకమైన అప్లికేషన్ అవసరాలు తీర్చడానికి వైజాగ్ కేంద్రం పనిచేస్తుంది. స్మార్ట్ సిటీ, అంతర్గత భద్రత అవసరాల కోసం సాఫ్ట్వేర్ సొల్యూషన్లను అందించడంతోపాటు సాఫ్ట్వేర్ ఇంటెన్సివ్ జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లను చేపట్టేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)తో కలిసి పనిచేస్తుంది. వైజాగ్ కేంద్రంగా 150 మంది ఇంజనీర్లు పనిచేస్తారు.
1954లో స్థాపితమైన బీఈఎల్ దేశం రక్షణ రంగానికి అవసరమయ్యే ఎలక్ట్రానిక్స్ సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు పనిచేస్తుంది. ఇది రాడార్లు, క్షిపణి వ్యవస్థలు, సైనిక కమ్యూనికేషన్లు, నౌకాదళ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఏవియానిక్స్, సీ4ఐ, ఎలక్ట్రో-ఆప్టిక్స్, అనేక ఇతర అత్యుత్తమ సాంకేతికతలను డిజైన్ చేస్తుంది. తయారు చేసి, సరఫరా చేస్తుంది.