Nellore Minor Girl: నెల్లూరులో పాఠశాల విద్యార్ధినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం, పోక్సో కేసునమోదు
Nellore Minor Girl: నెల్లూరు స్కూలుకు వెళ్లే విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. బాలికను మాయ మాటలు చెప్పి బీచ్కు తీసుకెళ్లిన నిందితుడు, అతని స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.

Nellore Minor Girl: నెల్లూరులో రోజు ఆటోలో బడికి తీసుకెళ్లే బాలికను మభ్యపెట్టి బీచ్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. ఆటోడ్రైవర్తో పాటు అతని స్నేహితుడు బాలికపై అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది.
నెల్లూరు నగర శివార్లలో ఉన్న పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక ఆటోలో స్కూలుకు వెళుతుంటుంది. జనవరి 29న ఆటో నడిపే డ్రైవరు సతీష్ కాకుండా కోవూరు సునీల్ బాలికను తీసుకెళ్లేందుకు ఆటో తీసుకు వచ్చాడు. బాలికను ఆటోలో ఎక్కించుకుని వెళ్లగా సతీష్ ద్విచక్రవాహనంపై వారితో వెళ్లాడు.
ఈ క్రమంలో మార్గమధ్యలో బాలికకు వాంతులు కావడంతో ఆమెను ఇంటికి తీసుకెళతానని చెప్పి సతీష్ బైక్పై ఎక్కించుకొని కోడూరు బీచ్ కు వెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఊళ్లోకి తీసుకువచ్చి పాఠశాల ఆటోలో ఎక్కించి పంపాడు. ఆ తర్వాత ఆటోడ్రైవరు కోవూరు సునీల్ కూడా బాధితురాలిపై అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించి ఇంటి దగ్గర వదిలేశాడు.
30వ తేదీ ఉదయం బాలిక చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి, వారి కుమార్తె 29వ తేదీన పాఠశాలకు రాలేదని చెప్పారు. తల్లిదండ్రులు కుమార్తెను ప్రశ్నించడంతో జరిగిన దారుణాన్ని వారికి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం పంపించారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్టు నెల్లూరు రూరల్ పోలీసులు తెలిపారు.