లిక్కర్ స్కామ్.. ఏపీలో మరో సంచలనం.. ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి రాజ్.. విజయసాయికి వార్నింగ్!-audio goes viral of kasireddy reddy rajasekhar reddy who is facing allegation in the ap liquor scam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  లిక్కర్ స్కామ్.. ఏపీలో మరో సంచలనం.. ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి రాజ్.. విజయసాయికి వార్నింగ్!

లిక్కర్ స్కామ్.. ఏపీలో మరో సంచలనం.. ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి రాజ్.. విజయసాయికి వార్నింగ్!

లిక్కర్ స్కామ్.. ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇదే అంశంపై ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాజాగా ఓ ఆడియో విడుదల చేశారు. ఇది కాస్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజ్ కసిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాం ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి.. ఓ ఆడియో విడుదల విడుదల చేశారు. సిట్ నోటీసులు, విజయసాయి మాటలపై ఆడియో సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ అవుతోంది. దీంట్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పిన అంశాలు ఇలా ఉన్నాయి.

మా అమ్మకు నోటీసులు ఇచ్చారు..

'మార్చిలో సిట్‌ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. నన్ను విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. ఎందుకు పిలుస్తున్నారో క్లూ ఇవ్వమని అడిగా. నా ఈ మెయిల్‌కు సెకండ్‌ నోటీసు ఇచ్చారు. నేను నా లాయర్లను సంప్రదించా. ముందస్తు బెయిల్‌ కోసం కూడా పిటిషన్ వేశా. సిట్‌ విచారణకు నేను పూర్తిగా సహకరిస్తా' అని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

నిజాలు బయటపెడతా..

శుక్రవారం సిట్ విచారణ అనంతరం విజయసాయి రెడ్డి ఇతనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్‌కు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'విజయసాయి రెడ్డి తీరు, చరిత్ర, నిజాలు త్వరలో బయటపెడతా' అని ఆడియో సందేశంలో కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. ఏం జరగబోతోందనే చర్చ నడుస్తోంది.

ఎవరీ కసిరెడ్డి.. అలియాస్ రాజ్ కసిరెడ్డి..

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని.. రాజ్ కసిరెడ్డిగా కూడా పిలుస్తారు. ఆయన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నారు. విదేశాలలో ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా లిక్కర్ కంపెనీలు ఉన్నాయని తెలుస్తోంది.

సిట్ ముందుకు మిథున్ రెడ్డి..

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో సిట్ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో ఆయన పాత్రపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ముందస్తు బెయిల్..

మిథున్ రెడ్డి విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో సిట్ విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సీపీ కార్యాలయంలో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

నో ఆడియో.. నో వీడియో..

మిథున్ రెడ్డి న్యాయవాదితో కలిసి సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డు చేయాలని మిథున్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు, అయితే కోర్టు తిరస్కరించింది. న్యాయవాది సమక్షంలో విచారణకు కోర్టు అంగీకరించింది. మద్యం సరఫరా, కొనుగోలు, అమ్మకాలలో అక్రమంగా లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో అదాన్ డిస్టిలరీస్ కూడా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కంపెనీ వెనుక రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత కథనం