Eluru Crime : ఏలూరు జిల్లాలో దారుణం- భార్యతో ప్రియుడి చాటింగ్, కుడి చేయి నరికి హత్య చేసిన భర్త-atrocity in eluru husband murdered after seeing his lover chatting with his wife ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Eluru Crime : ఏలూరు జిల్లాలో దారుణం- భార్యతో ప్రియుడి చాటింగ్, కుడి చేయి నరికి హత్య చేసిన భర్త

Eluru Crime : ఏలూరు జిల్లాలో దారుణం- భార్యతో ప్రియుడి చాటింగ్, కుడి చేయి నరికి హత్య చేసిన భర్త

Bandaru Satyaprasad HT Telugu
Updated Feb 18, 2025 03:43 PM IST

Eluru Crime : ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిని అతిదారుణంగా హత్య చేశాడు భర్త. తన భార్యతో తరచూ చాటింగ్ చేస్తున్నాడని కుడి చేయి సగానికి నరికి వేశాడు.

ఏలూరు జిల్లాలో దారుణం- భార్యతో ప్రియుడి చాటింగ్, కుడి చేయి నరికి హత్య చేసిన భర్త
ఏలూరు జిల్లాలో దారుణం- భార్యతో ప్రియుడి చాటింగ్, కుడి చేయి నరికి హత్య చేసిన భర్త

Eluru Crime : ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడి కుడి చేయి నరికి అతిదారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన యువకుడు మజ్జి ఏసు రాజు(26)ను శనివారం రాత్రి దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏసు తండ్రి ప్రసాద్‌ మరణించగా... తల్లి ప్రస్తుతం దుబాయ్‌లో ఉపాధికి వెళ్లారు. ఏసు, దుర్గా శ్రీవల్లిని 2023లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఏసు ఉండి మండలంలోని కలిగొట్ల గ్రామంలోని రొయ్యల చెరువుల కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు.

ఏసు భార్యకు ఎనిమిదో నెల కావడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఏసుతో పాటు అతడి అమ్మమ్మ మాత్రమే ఉంది. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఏసును బావాయిపాలెం శివారులోని చినకాపవరం పంటకాల్వ వద్ద హత్య చేసి, మృతదేహాన్న కాల్వ రేవు వద్ద పడేశారు. అతడి కుడి చేయిని నరికి తీసుకెళ్లారు. స్థానికుల సమాచారంతో ఆదివారం ఉదయం నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్‌, ఎస్సై వీర ప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి భార్య శ్రీవల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివాహేతర సంబంధంతో

ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వివాహిత భర్త, ఆమె మామ....ఏసు రాజును హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఇద్దరికి మరో వ్యక్తి సహకరించినట్లు సమాచారం. ఏసు రాజు కుడి చేయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల తెలిపిన వివరాలు ఇలా

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... నిడమర్రు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు యువకుడు ఏసు రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహిత భర్తకు వీరి ప్రేమ వ్యవహారం తెలిసి భార్యను, ఏసు రాజును పలుమార్లు హెచ్చరించాడు. అయినా వీరిద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆమె ప్రియుడు ఏసు రాజుతో చాటింగ్ చేయడం, తరచూ కలుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో శనివారం రాత్రి తన భార్యతో, ప్రియుడు ఏసురాజు ఉండటాన్ని గమనించాడు భర్త.

కుడి చేయి సగానికి

వివాహిత భర్త ఏసు రాజును బంధించి తన తండ్రికి సమాచారం ఇచ్చాడు. వివాహిత మామ గణపవరానికి చెందిన మరో వ్యక్తినితో కలిసి కలిగొట్ట వచ్చాడు. అనంతరం ఏసురాజును బావాయిపాలెం తీసుకెళ్లారు. తన భార్యతో ఛాటింగ్ చేస్తూ, మెసేజ్‌ పంపుతున్న ఏసురాజు కుడి చేయిని సగానికి నరికారు. అనంతరం ఏసురాజుపై తీవ్రంగా కొట్టి చినకాపవరం పంట కాల్వ రేవులో పడేశారు. చేయి నరికేయడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి ఏసురాజు మృతిచెందాడు.

బాధితుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నిడమర్రు పోలీసులు... వివాహిత భర్త, ఆమె మామను అరెస్ట్ చేసి, విచారించారు. పోలీసుల విచారణలో జరిగిన విషయాన్ని పోలీసులు ఒప్పుకున్నారు. తామే ఈ ఘటనకు పాల్పడినట్లు మరో వ్యక్తి తమకు సహకరించాడని అంగీకరించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం