Ancient Coin Fraud : పురాతన నాణెం పేరుతో లక్షల్లో టోకరా….
Ancient Coin Fraud అత్యంత పురాతన నాణెం, ఐదు కోట్లు ఖరీదు చేస్తుందని ప్రచారం చేసి, కొనేందుకు వచ్చిన వ్యక్తిని మోసం చేసిన ఘటన అల్లూరి జిల్లాలో వెలుగు చూసింది. అరుదైన నాణెం పేరుతో ఐశ్యర్యవంతులు అయిపోవచ్చనే మాయ మాటలు చెప్పి అమాయకుల్ని మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అరుదైన నాణానికి పరీక్షలు చేయాలని రూ.లక్షలు దోచుకున్నారు. నిందితుల నుంచి 8లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Ancient Coin Fraud అరుదైన నాణెంతో ఐశ్వర్యవంతులు కావొచ్చని మోసాలకు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పురాతన కాలం నాటి నాణెం రూ.5 కోట్లు ఖరీదు చేస్తుందని ప్రచారం చేశారు. మాయమాటలు నమ్మి దానిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించిన వ్యక్తిని బురిడీ కొట్టించారు.
ట్రెండింగ్ వార్తలు
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం చినలబుడు పంచాయతీ మాలి సింగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వంతల పూర్ణ, అదే గ్రామానికి చెందిన వంతల మనోజ్, పొట్టి రామదాసు, ప్రమోద్, అరకులోయలో ఒక దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న బాజీ నృద్దిన్ అలియాస్ బుజ్జి, చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ తొర్తుంపాడుకు చెందిన కొర్ర ప్రేమ్కుమార్ ముఠాగా ఏర్పడ్డారు.
తమ దగ్గర పురాతన నాణేలు ఉన్నాయని, వాటికి అతీత శక్తులు ఉంటాయని, ఒక్కో నాణెం రూ.కోట్ల ఖరీదు చేస్తుందని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. వీటిని తక్కువ ధరకు విక్రయిస్తామని అమాయకులను మభ్యపెడుతూ డబ్బులు దండుకుంటున్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలేనికి చెందిన కసిరెడ్డి రాజేశ్వరరావు ముఠా నుంచి ఒక నాణెం కొనేందుకు ఆసక్తి చూపాడు. ముఠా సభ్యుల్లో ఒకడైన ప్రేమ్కుమార్, బాధితుడికి ఫోన్ చేసి నాణెం గురించి వివరించాడు. నాణెం విక్రయించే ముందు కొన్ని పరీక్షలు చేయించాలని, అందుకు రూ.20 లక్షలు ఖర్చవుతుందని నమ్మబలికాడు. తన వద్ద రూ.8 లక్షలు మాత్రమే ఉన్నాయని రాజేశ్వర రావు చెప్పడంతో ఆ నగదు తీసుకువస్తే కొన్ని పరీక్షలు చేయిద్దామని చెప్పాడు.
రాజేశ్వరరావు ఈ నెల 16వ తేదీన తన మిత్రుడైన ఆయుర్వేద వైద్యుడు వసంతకుమార్, డ్రైవర్ చినఅ ప్పారావుతో కలిసి కారులో తొర్తుంపాడు గ్రామంలో ఉన్న ప్రేమ్కుమార్ వద్దకు వచ్చాడు. అప్పటికే రూపొందించుకున్న ప్రణాళిక రూపొందించుకున్న నిందితులు పూర్ణ, ప్రమోద్, మనోజ్, బాజీ నృద్ధిన్, ప్రేమ్కుమార్, రామదాసు కలిసి రాజేశ్వరరావును చుట్టుముట్టి కత్తితో పొడిచి చంపేస్తామని బెదిరించి రూ.8 లక్షలు నగదు లాక్కుని పరారయ్యారు.
డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు రాజేశ్వరరావు చింతపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, ఏఎస్పీ శివకిశోర్ వెంటనే దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. నిందితుల్లో వంతల పూర్ణ, కొర్ర ప్రేమ్కుమార్, బాజీ నృద్దిన్ లను పట్టుకున్నారు. నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.7,85,500 నగదు, దోపిడీకి వాడిన కారుతో పాటు మరో రెండు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
టాపిక్