భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. సరిహద్దులతో పాటు పలు రాష్ట్రాల్లో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. పాక్ చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో పాటు… దేశంలోనూ పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఈక్రమంలోనే ప్రముఖ్య అధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, నిఘా మరియు భద్రత విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి పలు కార్యక్రమాలు చేపట్టారు.
భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాతాల్లో తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనికీ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ విజయకుమార్ మాట్లాడుతూ…. తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందో దుండగులకు ఒక హెచ్చరికలాగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. స్వామి వారి భక్తులకు భరోసాలాగా సందేశం ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇందులో ఆక్టోపస్, పోలీస్, టీటీడీ నిఘా మరియు భద్రత సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఏరియా డామినేషన్ భద్రత సిబ్బంది నాలుగు గ్రూపులుగా విడిపోయి సిఆర్ఓ, ఆర్ టిసి బస్టాండ్, శ్రీవారి ఆలయం, నందకం పరిసర ప్రాంతాలు, ఎంబిసి మరియు శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
ప్రతిరోజు తిరుమలకు వచ్చే వాహనాలు, మఠాలు, అతిథి గృహాలు, స్థానిక నివాస ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో తిరుమల విజిఓ సురేంద్ర, ఆక్టోపస్ డిఎస్పి విశ్వనాథంతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సంబంధిత కథనం