Electric Bus Services to Tirupati: నెలాఖరు కల్లా తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు
నెలాఖరులోగా తిరుపతి నగరం నుంచి తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుల్ని నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 30 నాటికి తిరుపతి నుంచి తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సు సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తునట్లు ఆర్టీసి ఎండీ ద్వారకాతిరుమల రావు ప్రకటించారు. తిరుమల క్షేత్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుల్ని ప్రారంభించాలని ఆర్టీసి యోచిస్తోంది.
తిరుమల గిరులపై కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టింది. తిరుపతి నగరం నుంచి తిరుమలకు ఎలక్ట్రిక్ సర్వీసుల్ని ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తున్నారు. నిత్యం పెద్ద సంఖ్యలో ఆర్టీసి బస్సులు కొండపైకి వెళ్లే క్రమంలో భారీగా కాలుష్యం వెలువడుతోంది. కొండపైకి ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఎప్పట్నుంచో ప్రతిపాదనలు ఉన్నా సాంకేతిక కారణాలతో పాటు ఛార్జింగ్ పాయింట్ల లభ్యత సమస్యలతో ఆలశ్యమైనట్లు ద్వారకా తిరుమల రావు చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు ఆర్టీసితో చేసుకున్న ఒప్పందాలకు జాప్యం జరగడంతో సర్వీస్ ప్రొవైడర్పై జరిమానా కూడా విధించినట్లు చెప్పారు. నెలాఖర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బస్ సర్వీసుల్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. మరో 49 ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 100 ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టాలని రవాణా సంస్థ భావిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కూడా ఎలక్ట్రిక్ బస్ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.
టాపిక్