తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అమలాపురం, రాజోలు, రామచంద్రాపురం, రావులపాలెం నుంచి స్పెషల్ సర్వీసులు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. మే 15వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ యాత్రలో వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, రామప్ప దేవాలయం, కాళేశ్వరం ప్రాంతాలను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు 995922557 నంబర్కు కాల్ చేయవచ్చని.. ప్రజా రవాణా అధికారి ఎస్టీపీ కుమార్ సూచించారు.
ఈ పుష్కరాలు మొత్తం 12 రోజుల పాటు జరుగుతాయి. గురుడు మిథున రాశిలో ప్రవేశించిన సందర్భంగా ఈ పుష్కరాలు నిర్వహిస్తారు. కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా భావించే సరస్వతీ నదుల సంగమ స్థానం. ఈ సంగమం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పుష్కరాలకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పూజలు నిర్వహిస్తారు.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం- ఇక్కడ శివుడు, యముడు ఒకే పీఠంపై కొలువై ఉండటం విశేషం. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు.
శ్రీ మహా సరస్వతీ అమ్మవారి ఆలయం- కాళేశ్వరంలో సరస్వతీ దేవికి ప్రత్యేక ఆలయం ఉంది.
శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం
శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి ఆలయం
శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం- గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల సంగమ స్థానంలో ఈ ఆలయం ఉంది.
పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి.
సరస్వతీ నది పవిత్రత ఈ సమయంలో అధికంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.
పవిత్ర స్నానాలు ఆచరించడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా స్నాన ఘాట్లు, రహదారుల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతేకాకుండా భక్తుల కోసం టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈ సమయంలో కాళేశ్వరాన్ని సందర్శించడం, పవిత్ర స్నానాలు ఆచరించడం ఎంతో పుణ్యప్రదమైనదిగా భక్తులు భావిస్తారు.
సంబంధిత కథనం