APSRTC Exam Special : ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ
AP 10th Class Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఈ సందర్భంగా.. ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది.
ఏపీలో ఏప్రిల్ మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు(10th Class Exams) జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే.. విద్యార్థులు ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) బస్సుల్లో ఉచితంగా వెళ్లొచ్చు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని పల్లె వెలుగులు, సిటీ ఆర్టినరీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ కోరింది.
ట్రెండింగ్ వార్తలు
పది పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు(Students) ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు(APSRTC Buses)ల్లో ఉచితంగా రాకపోకలు సాగించేందుకు వీలు కల్పిస్తూ.. ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది. బస్ పాస్(Bus Pass) లేకపోయినా.. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ చూపించి.. విద్యార్థులు ఉచితంగా పరీక్షా కేంద్రానికి వెళ్లొచ్చు. పరీక్ష పూర్తయిన తర్వాత.. తిరిగి గమ్యస్థానాలకు ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు 6.60లక్షలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,348 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష(Exam)కు వెళ్లే సమయంలో పది విద్యార్థులు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. పరీక్షల సమయంలో హడావుడి పడకుండా విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు ఈ అవకాశం కల్పించారు.
ఏప్రిల్ మూడో తేది నుంచి 18 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పదో తరగతి పరీక్షలు(Tenth Class Exams) జరగనున్నాయి. ఆరు పేపర్లతో పదో తరగతి పరీక్షు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 3న గ్రూప్ ఏ విభాగంలో ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు. రెగ్యులర్ విద్యార్థులకు 10మార్కులకు, ఫస్ట్ లాంగ్వేజ్ కంపోజిట్ కోర్సులకు 70మార్కులకు నిర్వహిస్తారు.
ఏప్రిల్ ఆరో తేదీన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 8న ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 10వ తేదీన లెక్కలు, ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం, ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 17న కంపోజిట్ కోర్సుల్లో ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 11.15వరకు 30మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ కోర్సుల్లో భాగంగా ఏప్రిల్ 17న సంస్కృతం, అరబిక్, పర్షియన్ కోర్సుల్లో 100మార్కుల పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 18న ఓరియంటల్ లాంగ్వేజ్ కోర్సుల్లో మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షను సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేషనల్ కోర్సుల్లో థియరీ పరీక్షలు కూడా అదే రోజు నిర్వహిస్తారు. ఎస్సెస్సీ విద్యార్థులతో పాటు ఓరియంటల్ కోర్సు విద్యార్థులకు ప్రధాన కోర్సు సబ్జెక్టు పేపర్లు ఒకే విధంగా ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.
సంబంధిత కథనం