AP PC Exam Key : కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష కీ విడుదల... జనవరి 25 వరకు అభ్యంతరాలకు అవకాశం..
AP PC Exam Key : ఏపీ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష కీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది. సెట్ ల వారీగా కీని వెట్ సైట్ లో అందుబాటులో ఉంచింది. జనవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని... ఫలితాలు రెండు వారాల్లో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
AP PC Exam Key : ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష జనవరి 22న ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 5.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా 997 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షకు.. 4,58,219 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 45,268 మంది పరీక్షకు గైర్హాజయ్యారు. అభ్యర్థుల హాజరు 91 శాతంగా నమోదైందని.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (Andhra Pradesh State level Police Recruitment Board) ప్రకటించింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా.. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపింది.
ట్రెండింగ్ వార్తలు
ముందుగా ప్రకటించినట్లుగానే.... కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష జరిగిన రోజే కీ విడుదల చేసింది APSLPRB. నాలుగు సెట్లకు సంబంధించిన కీని వెబ్ సైట్ లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. ప్రశ్నా పత్రాలను కూడా అప్ లౌడ్ చేసింది. ప్రాథమిక కీపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే... జనవరి 25 సాయంత్రం 5 గంటల లోగా APSLPRBకి పంపించాలని పేర్కొంది. సూచించిన ఫార్మాట్ లో... mail-slprb@ap.gov.in మెయిల్ ద్వారా అభ్యంతరాలను పంపాలని సూచించింది. ఏ ఇతర ఫార్మాట్ ద్వారా పంపించిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని.. నిర్ణీత సమయం తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిశీలించబోమని స్పష్టం చేసింది. ప్రాథమిక పరీక్ష ఫలితాలను రెండు వారాల్లో ప్రకటిస్తామని వెల్లడించింది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
మొత్తం 6100 కానిస్టేబుల్ నియామకాల కోసం గతేడాది నవంబర్ 28న APSLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల్ని స్వీకరించింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మొత్తం 5,03,486 మంది దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో ఉద్యోగానికి ప్రాథమిక స్థాయిలో 82.5 మంది పోటీ పడ్డారు. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో 3,95,415మంది పురుషులు, 1,08,071 మంది మహిళలు ఉన్నారు. రిజర్వేషన్ క్యాటగిరీల వారీగా దరఖాస్తు చేసిన వారిలో ఓసీ అభ్యర్థులు 53,778, బీసీ అభ్యర్థులు 2,74,567మంది , ఎస్సీ అభ్యర్థులు 1,31,875మంది, ఎస్టీలు 43,266 మంది ఉన్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పరీక్ష రాసేందుకు అనుమతించారు.
411 ఎస్సై పోస్టులకి సంబంధించిన ప్రాథమిక పరీక్ష... ఫిబ్రవరి 19న జరగనుంది. ఎస్సై ప్రిలిమనరీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.... పేపర్ 2 మధ్యాహ్నం 2 : 30 నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు జరుగుతుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు ఫిబ్రవరి 5 నుంచి డౌన్ లౌడ్ చేసుకోవచ్చు.