APPSC New Rules : గ్రూప్ - 2, గ్రూప్ - 3 జాబ్స్ కి కొత్త నిబంధనలు.. ఈ టెస్ట్ తప్పనిసరి
APPSC New Rules : గ్రూప్ - 2, గ్రూప్ - 3 ఉద్యోగ నియామక ప్రక్రియలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఏపీపీఎస్సీ. ఈ ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యే వారంతా కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ పాస్ కావాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
APPSC New Rules : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Andhra Pradesh Public Service Commission) - ఏపీపీఎస్సీ పలు ఉద్యోగ నియామకాల్లో కీలక మార్పులు చేసింది. గ్రూప్ - 2 (Group-2)... గ్రూప్ - 3 (Group -2) రిక్రూట్మెంట్లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ ఉద్యోగాలకు పోటీ పడే వారికి కంప్యూటర్ అర్హత తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కొత్త రూల్స్ తో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ -2, గ్రూప్ - 3 ఉద్యోగ నియామకాల్లో కంప్యూటర్ ప్రొఫిషీయన్సీ సర్టిఫికెట్ ను తప్పనిసరి చేస్తూ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
కొత్త రూల్స్ ప్రకారం... గ్రూప్ - 2, గ్రూప్ -3 నోటిఫికేషన్ల ద్వారా నియమితులయ్యే వారంతా ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్టు (సీపీటీ) (Computer Proficiency test) పాస్ కావాల్సిందే. 100 మార్కులకి నిర్వహించే ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 30 మార్కులు... బీసీలు 35.. ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్టిఫికెట్ పొందిన వారే నియామకాలు అర్హులని... సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా నియామకానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాలకు ఈ నిబంధన వర్తించదని నిబంధనల్లో పేర్కొన్నారు.
సీపీటీ పరీక్షలో.. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలకు సంబంధించిన అంశాలపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్.. బేసిక్ కంప్యూటింగ్.. విండోస్.. ఇంటర్నెట్ తదితర అంశాల్లో అభ్యర్థులు పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆఫీస్ టూల్స్ నిర్వహణ.. డాక్యుమెంటేషన్ అంశాలపైనా ప్రశ్నలు ఉంటాయని నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం.. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ మొత్తం కంప్యూటర్, ఇంటర్నెట్ ఆధారితంగానే జరుగుతోన్న నేపథ్యంలో.... కొత్త ఉద్యోగాల్లో నియమితులయ్యే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలని భావించిన సర్కార్... ఈ మేరకు కొత్త రూల్స్ రూపొందించినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు... ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యుఎస్ వారికి ఐదేళ్ల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ తరహాలోనే ఈడబ్ల్యుఎస్కు ఐదేళ్ల వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ఫలితంగా ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్న వయోపరిమితి 39 ఏళ్లకు పెరగనుంది. తద్వారా ఉద్యోగాల భర్తీలో ఆయా వర్గాలకు మేలు జరగనుంది.