APPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్… వచ్చే నెలలో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు
APPSC Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీపీఎస్సీ. వచ్చే నెలలోనే గ్రూప్ -1, 2 నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ మంగళవారం ప్రకటన చేశారు.
Group Jons in Andhrapradesh: ఏపీ గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్... మరో కీలక ప్రకటన చేసింది. ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలోనే గ్రూప్ -1, గ్రూప్ -2 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ మంగళవారం ప్రకటన చేశారు.
ట్రెండింగ్ వార్తలు
మంగళవారం గ్రూప్–1 తుది ఫలితాల విడుదల సందర్భంగా సవాంగ్ మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో 110 గ్రూప్–1 పోస్టులు, 182 గ్రూప్–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో మూడింటిని పూర్తి చేశామని చెప్పారు. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 670 జూనియర్ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు.
గ్రూప్–1 కేడర్ పోస్టులకు కూడా ఇకనుంచి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహించనున్నట్టు సవాంగ్ తెలిపారు. గ్రూప్–1 పోస్టులకు సంబంధించి సీపీటీ సిలబస్లో మార్పులు చేస్తామన్నారు. గ్రూప్–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని చెప్పుకొచ్చారు. అయితే యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని వ్యాఖ్యానించారు.
గ్రూప్ 1 ఫలితాలు విడుదల….
AP Group 1 Results: 2018 గ్రూపు 1 ఫలితాలను మంగళవారం విడుదల చేసింది ఏపీపీఎస్సీ. గ్రూపు 1 ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించి గోదావరి జిల్లాకు చెందిన రాణి సుస్మిత డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైంది. రెండవ ర్యాంకును కడప జిల్లాకు శ్రీనివాసులు రాజు దక్కించుకున్నారు. మూడో ర్యాంకు సాధించిన హైదరాబాద్కు చెందిన సంజనా సింహకు దక్కింది. 2018 గ్రూప్ 1 ఫలితాల విడుదలలో ఎన్నో అవాంతరాలు ఎదురు అయ్యాయని ఛైర్మన్ సవాంగ్ చెప్పారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞనాన్ని వినియోగించినట్లు సవాంగ్ చెప్పారు. డిజిటల్ పద్దతిలో మూల్యాంకనం చేశామని తర్వాత కోర్టు ఆదేశాలతో మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం నిర్వహించినట్లు చెప్పారు.
నోటిఫికేషన్ నెంబర్ 27/2018లో మొత్తం 167 మంది అభ్యర్ధులను వివిధ పోస్టులకు ఎంపిక చేసినట్లు చెప్పారు. గ్రూప్ 1 సర్వీసులకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో https://psc.ap.gov.in పొందుపరిచారు. పరీక్షల నిర్వహణపై దాఖలైన రిట్ పిటిషన్లపై హైకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని కమిషన్ ఛైర్మన్ స్పష్టం చేశారు. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన వారిలో 30 మంది డిప్యూటీ కలెక్టర్లుగా రెవిన్యూ సర్వీసులకు ఎంపికయ్యారు. ఎనిమిది కమర్షియల్ టాక్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్లుగా, 28మంది డిఎస్పీలుగా, ఇద్దరు జైళ్ల శాఖలో డిఎస్పీలుగా, ఫైర్ సర్వీస్లకు ఒకరు, ట్రెజరీ సర్వీసులకు 13మంది, ఆర్టీవోలుగా ఐదుగురు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖలో ఏఎస్పీలుగా 11మంది, ఎంపీడీవోలుగా 47మంది, డిఆర్వోలుగా ఒక్కరు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా ఇద్దరు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఒకరు, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా ఒకరు,డిపిఆర్వోగా ఒకరు, గ్రేడ్ 2 మునిసిపల్ కమిషనర్గా ఒకరు, మెడికల్ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఆరుగురు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లుగా ఆరుగురు ఎంపికయ్యారు.