ఏపీలో రైట్ టూ ఎడ్యుకేషన్ ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత నిర్బంధ ప్రవేశాల షెడ్యూల్లో మార్పులు చేశారు. పేద విద్యార్థులకు 25 శాతం ఉచితంగా సీట్ల కేటాయింపు కోసం మే 2 నుండి మే 19 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 28 నుంచి జరగాల్సిన దరఖాస్తుల స్వీకరణను అనివార్య కారణాల వల్ల మే 2 నుండి మే 19వరకు మార్పు చేసినట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు.
గ్రామ, వార్డుసచివాలయాల డేటా ప్రకారం మే 20 నుండి మే 24 వరకు విద్యార్థుల ప్రవేశానికి అర్హతలు నిర్ణయిస్తారు. లాటరీ విధానంలో మొదటి విడత ఫలితాలను మే 29న విడుదల చేసి సీట్లు సాధించిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 8న ఖరారు చేస్తారు.
రెండో విడత ఫలితాలను జూన్ 11న విడుదల చేసి, సీట్లు సాధించిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 18న ఖరారు చేస్తారు.
అర్హులైన విద్యార్థులు ప్రాథమిక వివరాలతో https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులతో పాటు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
విద్యార్థి నివాసం ఉంటున్న ప్రస్తుత చిరునామా కోసం దరఖాస్తుదారుల తల్లిదం డ్రుల ఆధార్, ఓటరు కార్డు, రేషను కార్డు, భూమి హక్కుల పత్రం, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్తు బిల్లు, అద్దె ఒప్పంద పత్రాల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు, పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి.
ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మార్చి 31 నాటికి ఐదేళ్ల వయసు, స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు మే 31 నాటికి ఐదేళ్లు నిండిన పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004258599 సంప్రదించవచ్చు.
విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం అడ్మిషన్లను దారిద్య్రరేఖకు దిగువున ఉన్న పేదలకు తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుంది. ఆర్టీఈ ద్వారా కొన్నేళ్లుగా ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను పాఠశాల విద్యా శాఖ చేపడుతున్నా వాటి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఏటా అడ్మిషన్ల సమయంలో హడావుడి చేసే విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత జిల్లాల వారీగా ఏ పాఠశాలలో ఎన్ని అడ్మిషన్లు కల్పించారనే వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. ఇప్పటి వరకు ఆర్టీఏ ద్వారా కల్పించిన ప్రవేశాల వివరాలు కూడా విద్యా శాఖ బయటపెట్టలేదు. సమగ్ర శిక్ష అధికారులు ఆర్టీఈ అడ్మిషన్లను గోప్యంగా ఉంచుతున్నారు.
విద్యా హక్కు చట్టం ద్వారా ఎంతమంది పేద పిల్లలకు ప్రవేశాలు కల్పించారనే లెక్కలపై రెండేళ్లుగా గోప్యత కొనసాగిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఒత్తిడితోనే వివరాలు బయటపెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీఈ హక్కు చట్టం ద్వారా ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు ఉచితంగా అడ్మిషన్లను కల్పిస్తే తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు నగదు బదిలీ భారం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం