Balcony Collapse : బాల్కనీ కూలి ఇద్దరు మహిళల కన్నుమూత….
Balcony Collapse నాసిరకం నిర్మాణం ఇద్దరు మహిళల ప్రాణాలను బలితీసుకుంది. అపార్ట్మెంట్ బాల్కనీ కూలిపోవడంతో రెండు అంతస్తులో నిలబడి ఉన్న మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మూడో అంతస్తు కూలి రెండో అంతస్తుపై పడటంతో రెండు ఫ్లోర్లలో ఉన్న మహిళలు మృతి చెందారు.
Balcony Collapse నాసిరకం నిర్మాణంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అపార్ట్మెంట్ బాల్కనీ కూలి ఇద్దరు మహిళలు కిందపడి చనిపోయారు. ఈ సంఘటన బాపట్ల జిల్లా పర్చూరులో జరిగింది. పర్చూరు అద్దంకమ్మ ఆలయ బజారులో పదేళ్ల క్రితం ఐదు అంతస్తుల పవన్సాయి అపార్టుమెంట్ నిర్మించారు. అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్లు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
చెరుకూరు దేవాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న భూషాయపాలెం గ్రామానికి చెందిన చాగంటి మధుమోహన్ 2వ అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. కొల్లా వారి పాలేనికి చెందిన కొల్లా అనూరాధ మొదటి అంతస్తులో సొంత ఫ్లాటులో ఉంటున్నారు. మధుమోహన్ భార్య శ్రీవిద్య, కింది అంతస్తులో ఉన్న అనూరాధ గురువారం సాయంత్రం 2వ అంతస్తుకు ఉన్న బాల్కనీలో నిల్చుని మాట్లాడుకుంటున్నారు.
నాసిరకం నిర్మాణం కావడంతో బాల్కనీ ఒక్కసారిగా కూలి పోయింది. ఒకటో అంతస్తులోని బాల్కనీ మీదుగా శ్లాబ్తో సహా కింద పడిపోయారు. ఈ సంఘటనలో శ్రీవిద్య, అనూరాధ రెండో అంతస్తు నుంచి కింద పడిపోయారు. పై నుంచి పడిపోవడంతో శ్రీవిద్య అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన అనూరాధను స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జిజిహెచ్లో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అపార్ట్మెంట్ దెబ్బతిని కొంతకాలంగా పెచ్చులూడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మరమ్మతులు చేపట్టారు. నిర్మాణం నాణ్యత లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అందులో నివసిస్తున్న వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం….
టీ ఇస్తానంటూ ఇంట్లోకి పిలిచి, మానసిక ఆరోగ్యం సరిగా లేని యువతిపై అత్యాచారం చేసిన ఘటన బాపట్ల జిల్లా పర్చూరులో చోటుచేసుకుంది. పర్చూరులో నివసించే దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి జీవనోపాధి కోసం వేరే ఊళ్లో ఉంటూ అప్పుడప్పుడూ ఇంటికి వస్తుంటారు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి మానసిక ఎదుగుదల లేకపోవడంతో చదివించకుండా ఇంటి దగ్గరే ఉంచారు.
స్థానిక దుకాణంలో వస్తువులు కొనేందుకు వెళ్లిన సమయంలో సమీపంలో ఉండే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి టీ ఇస్తానంటూ యువతిని ఇంట్లోకి పిలిచాడు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి 8 గంటల తర్వాత ఆమెను బయటకు పంపాడు. కుమార్తె కోసం వెతుకుతున్న తల్లికి బాధితురాలు కనిపించేసరికి ఇంటికి తీసుకెళ్లారు.
అంతసేపు ఎక్కడికి వెళ్లావని ఆరా తీయడంతో నిందితుడి దుర్మార్గం వెలుగు చూసింది. టీ ఇస్తానంటూ సుబ్రహ్మణ్యం తనను ఇంట్లోకి తీసుకెళ్లి, అత్యాచారం చేసినట్లు వెల్లడించింది. దీంతో తల్లీకుమార్తెలు పర్చూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. నిందితుడు సుబ్రహ్మణ్యం భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా అతడిని విడిచి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉంటున్నట్లు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.
టాపిక్