తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీలో రేపు(మంగళవారం) 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు శ్రీకాకుళం జిల్లాలోని 4 మండలాలు, విజయనగరం జిల్లాలో 13 మండలాలు, మన్యం జిల్లాలో 11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం 12 మండలాల్లో తీవ్ర వడగాలులు, 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో 1 మండలం, విజయనగరం జిల్లాలో 8 మండలాలు, మన్యం జిల్లాలో 3 మండలాలు, అల్లూరి జిల్లాలో 1 మండలం, అనకాపల్లి జిల్లాలో 3 మండలాలు, కాకినాడ జిల్లాలో 3 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సోమవారం తిరుపతి రూరల్ లో 42.1°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంట, విజయనగరంలో 41.5°C, నెల్లూరు జిల్లా దగదర్తిలో 41.4°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పలు చోట్ల 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. రాత్రిళ్లు వాతావరణం మారుతున్న...పగటి పూట వేడికి ఇంట్లో ఉక్కపోత అధికంగా ఉంటుంది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
సోమవారం విశాఖ వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ...రెండు తెలుగు రాష్ట్రాలలో పొడి వాతవరణం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డీగ్రీలు ఎక్కువుగా నమోదయ్యే ఆవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు, ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు పడే ఆవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు కనిష్టంగా 28 డిగ్రీలు, గరిష్టంగా 40 డిగ్రీల వరకు నమోదయ్యే ఆవకాశం ఉందని పేర్కొన్నారు. వేడి, ఉక్కపోత తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
సంబంధిత కథనం