ఇవాళ మరో కొత్త స్కీమ్ ప్రారంభం - ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 15 వేలు...! అకౌంట్​లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్​ చేసుకోండి-ap vahana mitra scheme funds to be released today know these steps for check the status ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఇవాళ మరో కొత్త స్కీమ్ ప్రారంభం - ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 15 వేలు...! అకౌంట్​లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్​ చేసుకోండి

ఇవాళ మరో కొత్త స్కీమ్ ప్రారంభం - ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 15 వేలు...! అకౌంట్​లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్​ చేసుకోండి

రాష్ట్రంలో మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆటో డ్రైవర్ సేవలో(వాహనమిత్ర) పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలను అందజేస్తారు.

ఆటో డ్రైవర్ సేవలో పథకం

డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నారు.

ఈ పథకాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో పాటు కూటమి నేతలు హాజరవుతారు.

2.90 లక్షల మందికి రూ.436 కోట్ల లబ్ది….

  • సొంత ఆటో, క్యాబ్ కలిగి వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు.
  • వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.436 కోట్లను కేటాయించింది. ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది.
  • కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో ఆటో డ్రైవర్లు 2,25,621 మంది, త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు.
  • విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు లబ్ధి కలగనుంది.
  • స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అమలు నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థ…

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే... వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు.

దీని కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు…

  • ముందుగా https://gsws-nbm.ap.gov.in/NBM/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో స్కీమ్ ఆప్షన్(ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఆటో అండ్ మ్యాక్స్ క్యాబ్ ఓనర్స్) ఎంచుకోవాలి.
  • స్కీమ్ ఆప్షన్ ను ఎంచుకున్న తర్వాత 2025- 26 సంవత్సరాన్ని ఎంపిక చేసుకోవాలి.
  • ఆపై దరఖాస్తుదారుడి ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • క్యాప్చాను ఎంట్రీ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి,
  • ముందుగా మీకు బేసిక్ డేటేయిల్స్ కనిపిస్తాయి. ఇందులో దరఖాస్తుదారుడి వివరాలుంటాయి. ఆ తర్వాత… అప్లికేషన్ వివరాలుంటాయి. ఇందులో దరఖాస్తు తేదీ, స్టేటస్, రిమార్క్ అనే ఆప్షన్స్ ఉంటాయి. రిమార్క్ దగ్గర ఏమైనా వివరాలుంటే మీ దరఖాస్తులో ఇబ్బందులు ఉన్నట్లు.. అలా లేకపోతే మీ ఖాతాలో ఈ స్కీమ్ కింద డబ్బులు జమవుతాయి.
  • డబ్బుల జమ అయిన తేదీ, బ్యాంక్ వివరాలు కూడా డిస్ ప్లే అవుతాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం