AP TET Results 2024 Updates : ఏపీ టెట్ ఫలితాల విడుదల సందిగ్ధత వీడటం లేదు. మార్చి 14వ తేదీనే ఫలితాల వెల్లడి ఉండాల్సినప్పటికీ… ఈసీ అనుమతి లేకపోవటంతో ప్రక్రియ ఆగిపోయింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఫలితాల విడుదల కోసం ఈసీని విద్యాశాఖ అనుమతి కోరింది. కానీ ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవటంతో ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. అయితే మే 13వ తేదీన ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో టెట్ ఫలితాల విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపించాయి.
ఏపీలో పోలింగ్ ముగిసి కూడా పది రోజులు దాటిపోయింది. కానీ టెట్ ఫలితాల విడుదలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు.అయితే తాజా పరిస్థితులను చూస్తుంటే…. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… ఫలితాల రావటమే కాకుండా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.
జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం…. వీటిపై దృష్టిసారించే అవకాశం ఉంది. పైగా ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేస్తారు. దీంతో ఈసీ అనుమతి లేకుండానే విద్యాశాఖ ఫలితాలను ప్రకటించే ఛాన్స్ ఉంటుంది.
ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్(AP DSC) విడుదలైన సందతి తెలిసిందే. ఆన్ లైన్ లో దరఖాస్తులను కూడా స్వీకరించారు. 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది. టెట్ కు 20 శాతం, డీఎస్సీకి 80 శాతం వెయిటేజీ ఉంటుందని పేర్కొంది.
మొత్తం 6100 పోస్టుల్లో 2280 ఎస్జీటీ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 2299, టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 పోస్టులు ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేసినప్పటికీ… ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. టెట్ ఫలితాల విడుదలైన తర్వాతే… డీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.