అల్పపీడనం ఎఫెక్ట్-రేపు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు-ap telangana brace for heavy rain tomorrow low pressure weather monsoon condition ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అల్పపీడనం ఎఫెక్ట్-రేపు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

అల్పపీడనం ఎఫెక్ట్-రేపు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.

అల్పపీడనం ఎఫెక్ట్-రేపు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది. రేపు అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు వద్ద ఉండొద్దని అధికారులు కోరారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం

మంగళవారం నాటికి పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటి నుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది.

కేరళను తాకిన రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు మే 24 నాటికి కేరళలో ప్రవేశించాయి. రుతుపవనాలు సాధారణ తేదీ కంటే 8 రోజుల ముందు కేరళలో ప్రవేశించాయి. రెండు మూడు రోజుల్లో ఏపీలో ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంతో పాటు పలు ప్రాంతాలకు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించారు.

అలాగే మిజోరాంలోని కొన్ని ప్రాంతాలు, మణిపూర్‌, నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలకు విస్తరించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాగల మూడు రోజులు తెలంగాణకు వర్షసూచన

మరఠ్వాడ, ఉత్తర కర్ణాటక వద్ద ఉన్న అల్పపీడనం...రాబోయే 24 గంటల్లో నెమ్మదిగా తూర్పు వైపునకు కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం