ఉగ్రవాద నిర్మూలనలో భారత బలగాల ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణమని.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొనియాడారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీరజవాన్లకు మద్దతుగా తన ఒక నెల వేతనం రూ.2,17,000 నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ప్రకటించారు. దేశభక్తి గల పౌరులందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. భారత్- పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. భారత సైన్యానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. దేశ రక్షణ నిధికి విరాళం కూడా ప్రకటించారు.
భారత జాతీయ రక్షణ నిధిని 1962లో స్థాపించారు. దీని స్వచ్ఛంద విరాళాలను స్వీకరిస్తారు. ఈ నిధిని సాయుధ దళాలు (పారా మిలిటరీ దళాలతో సహా), వారిపై ఆధారపడిన వారి సంక్షేమం కోసం ఉపయోగిస్తారు. ఈ నిధిని ఒక కార్యనిర్వాహక కమిటీ నిర్వహిస్తుంది. దీనికి భారత ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉంటారు. హోం మంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి సభ్యులుగా ఉంటారు. ఆర్థిక మంత్రి ఈ నిధికి కోశాధికారిగా వ్యవహరిస్తారు.
జాతీయ రక్షణ నిధికి ప్రజలు, సంస్థలు, ట్రస్టులు, కంపెనీలు మొదలైన వారు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వవచ్చు. ఈ విరాళాలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తారు. ఆన్లైన్లో ndf.gov.in, pmindia.gov.in ద్వారా ఇవ్వవచ్చు. నేరుగా ఖాతాలో జమ చేయవచ్చు. లేదా 'నేషనల్ డిఫెన్స్ ఫండ్' పేరు మీద చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా విరాళం ఇవ్వవచ్చు.
ఈ నిధి ద్వారా సాయుధ దళాలు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉపయోగిస్తారు. దీని ద్వారా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ప్రధానమంత్రి స్కాలర్షిప్ పథకం. ఈ పథకం ద్వారా సాయుధ దళాలు, పారా మిలిటరీ దళాలు, రాష్ట్ర పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, వారి పిల్లల ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నారు. దేశ భద్రతకు, మన సైనికుల సంక్షేమానికి మన మద్దతును అందించడానికి ఇది మంచి వేదిక.
సంబంధిత కథనం