సీనియర్ సిటిజన్ కార్డు-సచివాలయాల్లో దరఖాస్తుకు ఆప్షన్ ఓపెన్, కావాల్సిన పత్రాలివే-ap senior citizen card option open for application at village gram secretariats required documents list here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  సీనియర్ సిటిజన్ కార్డు-సచివాలయాల్లో దరఖాస్తుకు ఆప్షన్ ఓపెన్, కావాల్సిన పత్రాలివే

సీనియర్ సిటిజన్ కార్డు-సచివాలయాల్లో దరఖాస్తుకు ఆప్షన్ ఓపెన్, కావాల్సిన పత్రాలివే

ఏపీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు డిజిటల్ కార్డులు అందిస్తుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డు దరఖాస్తుకు ఆప్షన్ ఇచ్చింది. 60 ఏళ్లు దాటిని పురుషులు,58 ఏళ్లు దాటిన మహిళలు ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డుతో ఆర్టీసీ, రైల్వే టికెట్లలో రాయితీ లభిస్తుంది.

సీనియర్ సిటిజన్ కార్డు-సచివాలయాల్లో దరఖాస్తుకు ఆప్షన్ ఓపెన్, కావాల్సిన పత్రాలివే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే సచివాలయాల్లో ఆప్షన్ ఓపెన్ అయ్యిందని సిబ్బంది తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రాయితీ సహా ఇతర సదుపాయాలను ఈ కార్డు ద్వారా పొందవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా చెల్లుబాటు

సీనియర్‌ సిటిజన్‌ కార్డుతో దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలను సులభంగా, వేగంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్ కార్డు లేనివారు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డు ఉంటే ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవలు పొందేందుకు వీలుగా 60 ఏళ్లు దాటిన వారికి సీనియర్ సిటిజన్ కార్డులను కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఈ కార్డు ఉండే ప్రతిసారీ వయసు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా ఆ వ్యక్తి వయస్సు ఎంతో తెలుస్తోంది. ప్రతిసారీ ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు రుజువుగా చూపించాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ కల్పిస్తారు.

వృద్ధాప్యంలో కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారికి, ఎవరూ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు సైతం సీనియర్ సిటిజన్ కార్డు ఉపయోగపడుతుంది. 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్‌ సిటిజన్‌ కార్డును ప్రభుత్వం జారీ చేస్తుంది.

సీనియర్ సిటిజన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

సీనియర్ సిటిజన్ కార్డు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును ఇస్తారు. సచివాలయాల్లో అప్లై చేసుకున్న వారికి వారంలో కార్డు అందుతుంది. డిజిటల్ కార్డు దరఖాస్తుకు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, బ్లడ్ గ్రూప్, ఆధార్ కార్డు హిస్టరీ, ఇతర ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.

ప్రయోజనాలు

సీనియర్ సిటిజన్ కార్డుతో ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌లో 25 శాతం రాయితీ కల్పిస్తారు. అలాగే దూర ప్రాంతాల బస్సులు మినహా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నింటిలో వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్‌ చేస్తారు. రైల్వే స్టేషన్లలో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్‌ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారికి వీల్‌ఛైర్‌ సదుపాయం కల్పిస్తారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణులకు లోయర్‌ బెర్త్‌ల రిజర్వేషన్‌ కేటాయింపులో ప్రాధాన్యత కల్పిస్తారు. ఈ కార్డు కలిగి ఉంటే కోర్టుల్లో కేసుల విచారణలోనూ ప్రాధాన్యత లభిస్తుంది. పాస్‌పోర్ట్ సేవా ఫీజుల్లో 10 శాతం రాయితీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ, 80 ఏళ్లు దాటితే 1 శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది.

సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్న వారి పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. 60 ఏళ్లు పైబడితే 3 లక్షల వరకు 80 ఏళ్లు దాటితే 5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం