ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. మే 7 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు, రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం కల్పించారు. వాట్సాప్ 'మన మిత్ర'లో కూడా రేషన్ కార్డు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో దాఖలైన దాదాపు 3.36 లక్షల అప్లికేషన్లను కూటమి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే మే 15 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం వాట్సాప్ ‘మనమిత్ర’ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా పలు రకాల ప్రభుత్వ సేవలను అందిస్తుంది. ఈ డిజిటల్ విధానం ద్వారా రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 31 వరకు రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ నెలలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
కొత్త రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకూ వచ్చిందో ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చు. మే 7 నుంచి ఏపీ ప్రభుత్వం 7 రకాల రేషన్ కార్డ్ సర్వీసులను తిరిగి ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయంలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత, రసీదును అక్కడే పొందవచ్చు. అయితే రేషన్ కార్డు ఈకేవైసీ ఆమోదం కోసం కొంత సమయం పడుతుంది. ఇందుకు 21 రోజుల నుండి 6 నెలల వరకు పట్టే అవకాశం ఉంది.
సంబంధిత కథనం