బీజేపీ ఖాతాలోకి ఏపీ రాజ్యసభ ఎంపీ.. రేసులో మంద కృష్ణ మాదిగ, అన్నామలై.. కొలిక్కి వచ్చిన అభ్యర్థి ఎంపిక!-ap rajya sabha mp in bjps account manda krishna madiga annamalai in the race ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  బీజేపీ ఖాతాలోకి ఏపీ రాజ్యసభ ఎంపీ.. రేసులో మంద కృష్ణ మాదిగ, అన్నామలై.. కొలిక్కి వచ్చిన అభ్యర్థి ఎంపిక!

బీజేపీ ఖాతాలోకి ఏపీ రాజ్యసభ ఎంపీ.. రేసులో మంద కృష్ణ మాదిగ, అన్నామలై.. కొలిక్కి వచ్చిన అభ్యర్థి ఎంపిక!

Sarath Chandra.B HT Telugu

ఏపీలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం బీజేపీకి దక్కనుంది. ఈ స్థానానికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రేసులో ఉన్నారు. వీరిలో ఒకరిని రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉంది.

ఏపీ సీఎం చంద్రబాబుతో ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (ఫైల్)

ఏపీలో మాజీ వైసీపీ ఎంపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బీజేపీకి దక్కనుంది. ఈ మేరకు కూటమి పార్టీల మధ్య ఇప్పటికే అవగాహన కుదిరింది. మంగళవారం ఢిల్లీలో రాజ్యసభ అభ్యర్థిత్వంపై బీజేపీ అగ్రనేతలతో జరిగిన చర్చల్లో ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది.

మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థి విషయంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. దీంతో బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అన్నామలైకు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు ఉన్నట్టు బీజేపీలో ప్రచారం జరుగుతోంది. త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అన్నామలైకు చోటు దక్కుతుందని చెబుతున్నారు.

మరోవైపు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు అవకాశం కల్పించే అంశంపై కూడా చర్చ జరిగింది. ఢిల్లీలో ఉన్న మందకృష్ణ మాదిగ... మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో వెళ్లి అమిత్ షాను, చంద్రబాబును కలుసుకున్నారు.

రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డికే దానిని కేటాయిస్తారంటూ వచ్చిన ప్రచా రంలో వాస్తవం లేదని బీజేపీ, టీడీపీ వర్గాలు మంగళవారం స్పష్టం చేశాయి.

అన్నామలై ఐపీఎస్ అధికారిగా కర్ణాటక క్యాడర్‌లో పనిచేశారు. దక్షిణ బెంగుళూరు డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తూ పదవికి రాజీనామా చేసి, 2020లో బీజేపీలో చేరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించిన బీజేపీ.. అన్నామలైను తమిళనాడు అధ్యక్షుడిగా ఆ పార్టీ శాసనసభా పక్ష నేత నాగేంద్రన్‌ను నియమించింది.

ముఖ్యమంత్రితో మందకృష్ణ మాదిగ..

విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబును మంద కృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఆర్డినెన్స్‌ జారీ చేసిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ ఉద్యమానికి చంద్రబాబు అండగా నిలిచారని మందకృష్ణ గతంలో పలుమార్లు ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపనున్నట్లు కృష్ణమాదిగ వివరించారు. అనంతరం ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికార నివాసం జన్‌పథక్‌ వచ్చి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు.త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మందకృష్ణ, అన్నామలైలలో ఒకరికి చోటు దక్కుతుందని విస్తృత ప్రచారం జరుగుతోంది.

30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. కాకినాడ సీ పోర్ట్‌ వ్యవహారంలో ఈడీ కేసులు నమోదు చేసిన తర్వాత అనూహ్యంగా ఎంపీ పదవికి సాయిరెడ్డి రాజీనామా చేశారు.

విజయ సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మే 9న పోలింగ్ జరుగుతుంది.

ఏపీలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీ లన ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. 13వ తేదీలోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం