AP Elections : తొందరపడి ఓ కోయిల ముందే కూసింది.. ఏపీలో ముందస్తు పక్కానా?!
AP Early Polls : జగన్ ముందస్తుకు వెళ్తారని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. 2023లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కొంతమంది చర్చ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఇంకా ఈ వాదనకు బలం చేకూరినట్టైంది.
ఏపీలో పొలిటికల్ హీట్ చూస్తే.. ఇక రేపో మాపో ఎన్నికలు అన్నట్టుగానే కనిపిస్తుంది. పార్టీలు జనాల్లోకి వెళ్లి.. నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. అధికార వైసీపీ(YCP), ప్రతిపక్ష టీడీపీ(TDP), జనసేన(Janasena) పార్టీలు చాలా రోజుల నుంచి విమర్శల దాడి పెంచాయి. దీనికితోడు.. నేతలతో జిల్లాల వారీగా సమీక్షలు జరుగుతున్నాయి. సామాన్యుడికి కూడా ముందుస్తు ముచ్చట ఉందా అనే అనుమానం కలుగుతుంది.
ట్రెండింగ్ వార్తలు
ఇలాంటి ఆలోచనల మధ్యలో మంత్రి సిదిరి అప్పలరాజు(Minister Sidiri Appalaraju) చేసిన కామెంట్స్.. జనాల్లోకి బలంగా వెళ్లాయి. ఆయన వ్యాఖ్యలు ముందస్తుకు సంకేతామని చర్చ లేస్తోంది. 'రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వైసీపీ పార్టీదే విజయం. మన ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత లేదు.' అని సిదిరి అప్పలరాజు అన్నారు.
నిజానికి 2024లో ఎన్నికలు(2024 Elections) జరగాల్సి ఉంది. కానీ ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని మంత్రే కామెంట్ చేయడంతో ముందస్తుపై ఊహగానాలు మెుదలయ్యాయి. ఒకవేళ సీఎం జగన్(CM Jagan) ముందస్తుకు వెళ్లినా.. వెళ్లొచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాల వారీగా కూడా సీఎం జగన్ సమీక్షలు చేస్తూ.. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఫస్ట్ టార్గెట్ కుప్పం, వై నాట్ 175లాంటి స్లోగన్స్ తో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
ఇలా మంత్రి అప్పలరాజు కామెంట్స్ కు తోడు.. గడప గడపకు మన ప్రభుత్వం లాంటి కార్యక్రమాలతో అధికార వైసీపీ జనాల్లోనే ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను(Welfare Schemes) ప్రజలకు ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారు. ఇది చూసిన వారు ముందుస్తులో భాగమే ఈ కార్యక్రమం అని కూడా అంటున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన పార్టీ కూడా.. జనాల్లోకి బలంగా వెళ్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలా? అనేలా జిల్లాల్లో తిరుగుతున్నాయి పార్టీలు.
సీఎం జగన్ సైతం.. ప్రతిపక్షాలపై విమర్శల దాడి పెంచారు. ఇచ్చిన హామీల్లో 90 శాతానికిపైగా నెరవేర్చామని పదే పదే చెబుతున్నారు. గత పాలనను, వైసీపీ పాలనను అంచనా వేసుకోవాలని అంటున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవుతూ.. దిశానిర్దేశం చేస్తున్నారు. రేపో మాపో ఎన్నికలు అనేలా వైసీపీ చేస్తుండటంతో.. టీడీపీ, జనసేన కూడా ఇదే బాటలో వెళ్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నేతలను ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని రెడీ చేస్తున్నారు.