Disability Persons Petrol Subsidy : దివ్యాంగులకు సబ్సిడీపై పెట్రోల్, డీజిల్- 50 శాతం రాయితీకి ఇలా అప్లై చేసుకోండి
Disability Persons Petrol Subsidy : రాష్ట్రంలో దివ్యాంగులకు సబ్సిడీ మీద పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని వికలాంగుల సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Disability Persons Petrol Subsidy : రాష్ట్రంలో50 శాతం సబ్సిడీతో పెట్రోల్, డీజిల్ ఇవ్వడం దివ్యాంగులకు వర్గాల వారికి ఉపశమనం కలుగుతోంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్రంలోని పెట్రోల్, డీజిల్ సబ్సిడీ పథకం స్వయం ఉపాధి ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా మూడు చక్రాల మోటారు వాహనాలను ఉపయోగించే వికలాంగులకు ఇంధన ధరలపై 50 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఈ సబ్సిడీ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాల్లో రూ.26 లక్షలను కేటాయించింది.
రెండు హార్స్పవర్ ఉన్న వాహనాలకు 15 లీటర్లు, రెండు హార్స్పవర్ కంటే ఎక్కువ ఉన్న వాహనాలకు 25 లీటర్లు పరిమితి విధించారు. సబ్సిడీ కేవలం పని సంబంధిత ప్రయాణాలకు ఇంధన ఖర్చులకు మాత్రమే పరిమితం చేశారు. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు మాత్రమే సబ్సిడీ క్లైయిమ్ చేసుకోవడానికి వీలుంటుంంది. ఈ సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. మూడు చక్రాల మోటారు వాహనాలు ఉన్న దివ్యాంగులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకునే దివ్యాంగులు ప్రభుత్వం జారీ చేసే వైకల్య ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆ వాహనం కూడా స్వయం ఉపాధి ప్రయోజనాలకు కోసం మాత్రమే ఉపయోగించాలి. అలాంటప్పుడు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. లేకపోతే సబ్సిడీ వర్తించదు. అలాగే దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు చెందిన వారై ఉండాలి. దరఖాస్తును ఆయా జిల్లాల్లో వికలాంగుల సంక్షేమ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దివ్యాంగులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, స్వయం ఉపాధిని కొనసాగించడానికి, వారి జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు వారికి శక్తినిస్తుంది. అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనాలను పొందేందుకు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందుకోసం మీ జిల్లాల్లోని వికలాంగుల సంక్షేమ కార్యాలయాన్ని సందర్శించి, అదనపు సమాచారాన్ని తెలుసుకుని దరఖాస్తు చేసుకోగలరు.
దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు శ్రీకాకుళం విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత తెలిపారు. సొంత వ్యాపారం చేస్తున్నా, లేదా గుర్తింపు కలిగిన ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనం కలిగి ఉన్న దివ్యాంగులు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అదనపు వివరాల కోసం 08942-240519 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని ఆమె సూచించారు.
అవసరమైన ధ్రువీకరణ పత్రాలు
1. వికలాంగు సర్టిఫికేట్
2. వెహికల్ రిజిస్ట్రేషన్ పత్రాలు
3. బ్యాంక్ అకౌంట్ బుక్ మొదటి పేజీ
4. దరఖాస్తు ఫారం (పూర్తి చేసి ఉండాలి)
5. తెల్ల రేషన్ కార్డు
6. డ్రైవింగ్ లైసెన్స్
7. పెట్రోల్ కొనుగోలు చేసే బిల్లులు
8. ఆధార్ కార్డు
9. ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న ధ్రువీకరణ పత్రం
10. ఒక పాస్ పోర్టు సైజ్ ఫోటో
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు