YS Sharmila On Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విరమ్శించారు. ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ... పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. పవన్ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారన్నారు.
"పవన్ కల్యాణ్ జనసేన పార్టీని.. ఆంధ్ర మతసేన పార్టీగా మార్చారు. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం. పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేల్కోండి. బీజేపీ మైకం నుంచి బయట పడండి"- వైఎస్ షర్మిల
"టీడీపీ బీ టీమ్ గా ఆవిర్భవించిన పార్టీయే జనసేన. కాపుల ఓట్లు కోసం పవన్ కల్యాణ్ ను ఉపయోగించుకున్నాడు చంద్రబాబు. తెలుగుదేశాన్ని, జనసేనను మేనేజ్ చేసేది చంద్రబాబే..జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ చంద్రబాబు పంపించిన వాళ్లే. పవన్ కల్యాణ్ ఎర్ర కండువా నుంచి కాషాయ కండువాకి వచ్చారు. పవన్ కల్యాణ్
ఊసరవెల్లిలా మారుతున్నారు. అవకాశవాద రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. నాడు వారసత్వ రాజకీయాలను విమర్శించి నేడు అన్నయ్యకు ఎమ్మెల్సీ సీటు ఇప్పించుకున్నారు."-అంబటి రాంబాబు, వైసీపీ నేత
జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ జనసేన స్థాపించారని, పవన్ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు.. కుటుంబం కోసమే పోరాటం చేస్తారంటూ అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు.
"కాపు సమాజం మీద అనేక దుశ్చర్యలకు పాల్పడిన చంద్రబాబు, కాపులను నేరుగా చేతుల్లోకి తీసుకోలేక టీడీపీ బీ టీమ్గా పనిచేయడానికి పవన్ కల్యాణ్ సారథ్యంలో జనసేన ఏర్పాటు చేయించారు. కాపుల ఓట్లను తనవైపు తిప్పుకునే ప్రక్రియలో భాగంగానే ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు మేం మొదటి రోజు నుంచి చెబుతూ వస్తున్నాం. చంద్రబాబుకి ఏ ఆపద వచ్చినా కాపు కాయడానికి పవన్ కల్యాణ్ ముందుకొస్తారు. కాబట్టే జనసేన పార్టీ మెయింటినెన్స్ బాధ్యతలన్నీ చంద్రబాబే చూస్తారు"-మాజీ మంత్రి అంబటి రాంబాబు
సంబంధిత కథనం