ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, మార్పు చేర్పుల కోసం వస్తున్న వారితో గ్రామ, వార్డు సచివాలయాలు, హడావుడిగా కనిపిస్తున్నాయి. దరఖాస్తు ప్రక్రియపై మరో అప్డేట్ వచ్చింది.
ఏపీలో కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరంలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
రైస్ కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒంటరి మహిళల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది వెళ్లి ధ్రువీకరించి, కార్డులను అందిస్తారని చెప్పారు. ఒంటరి మహిళలకు సింగల్ మెంబర్ కార్డులు అందిస్తామని ఇప్పటికే ప్రకటించామన్నారు. భార్యభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటితే ఒంటరి మహిళలకు కార్డులు జారీ చేస్తామన్నారు.
దరఖాస్తుల స్వీకరణలో వస్తున్న సాంకేతిక పరిష్కరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే దరఖాస్తుల గడువు పొడిగిస్తామన్నారు. కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనూ కొత్త కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
"కొత్తగా పెళ్లైన వారు కార్డు కోరుకుంటారు. అందుకోసం గతంలో వివాహ ధ్రువీకరణ పత్రాలు అడిగాం. దరఖాస్తు సమయంలో మ్యారేజీ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు. సచివాలయ సిబ్బంది ఇంటికి వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు మ్యారేజీ సర్టిఫికెట్ చూపాల్సిన అవసరంలేదు. ఆన్ లైన్ లో మాత్రం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు" -మంత్రి నాదెండ్ల
రైస్ కార్డులో సభ్యులను జోడించేందుకు పెళ్లైన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లి ఫొటో రెండూ అవసరం లేదు. నేటి నుంచి మార్పులు వచ్చాయని సచివాలయ సిబ్బంది తెలిపారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ మొదటి వారం నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ముందుగా హైదరాబాద్కు సంబంధించిన కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ మొదలుకానుందని సివిల్ సప్లై అధికారులు స్పష్టం చేశారు. రేషన్ కార్డులకు భారీగా దరఖాస్తులు రావడంతో వెరిఫికేషన్ కు సమయం పడుతుందని అంటున్నారు.
హైదరాబాద్ సిటీలో తొమ్మిది సర్కిళ్ల పరిధిలో మొత్తం 6,39,451 రేషన్ కార్డులున్నాయి. కొత్తగా 4 లక్షల వరకు రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. బల్దియా, ఈసేవ, కలెక్టరేట్ ప్రజావాణిలో 2, 3సార్లు దరఖాస్తు చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. లక్షల్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించడానికి సీఆర్ఓ పరిధిలో సరిపడా సిబ్బంది లేరని, అదనపు సిబ్బంది కోసం రెవెన్యూ, బల్దియాలకు లేఖలు రాశామని అధికారులు తెలిపారు.
ఈ నెలాఖరులోగా పలువురు సిబ్బంది డిప్యుటేషన్పై వచ్చే అవకాశం ఉందని, వారు రాగానే జూన్ మొదటి వారం నుంచి రేషన్ కార్డు దరఖాస్తులను ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తామని అధికారులు చెప్తున్నారు. అర్హులను గుర్తించి కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. రేషన్కార్డులకు దరఖాస్తులకు గడువు అంటూ ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం