ఏపీ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు. ఈ నెల 25న ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అపాయింట్మెంట్ లెటర్స్ అందుకుంటారు. అమరావతి ఈ మేరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు వారికి నియామక పత్రాలు అందజేస్తారు. వాస్తవానికి ఈ నెల 19వ తేదీన అందించాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో ఈ నెల 25వ తేదీన అందించేందుకు నిర్ణయించింది. తాజాగా సిద్ధమైంది.
పాఠశాల విద్యా శాఖ ఏపీ మెగా డీఎస్సీ 2025 అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ఇటీవలే విడుదల చేసింది. ప్రభుత్వ, పంచాయతీ రాజ్, మున్సిపల్ పాఠశాలలతో పాటు గిరిజన, సామాజిక, బీసీ మరియు బాలల సంక్షేమం, మోడల్, రెసిడెన్షియల్, ప్రత్యేక పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ఈ నియామక డ్రైవ్ లక్ష్యం.
నోటిఫికేషన్ ఏప్రిల్ 20, 2025న జారీ అయింది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) జూన్ 6 నుండి జూలై 2 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహించారు. ప్రిలిమినరీ కీని జూలై 5న, ఫైనల్ కీని ఆగస్టు 1న విడుదల చేశారు.
16347 పోస్టులకు.. 15941 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. 406 ఖాళీగా మిగిలిన పోస్టులు ఉన్నాయి. ప్రతీ ఏటా డీఎస్సీ ఉంటుందని మంత్రి నారా లోకేష్ ఫలితాల విడుదల సందర్భంగా ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగానే మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ ఫైల్ మీద సంతకం చేశారని చెప్పారు. ఉద్యోగాలు సాధించలేకపోయినవారు.. నిరుత్సాహపడొద్దని అవకాశాలు వస్తాయన్నారు.
టాపిక్