ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. వైసీపీలో కీలక నేతలపై ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి చుట్టూ వ్యవహారం అంతా తిరుగుతోంది. శనివారం ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను దాదాపు 8 గంటల పాటు సిట్ బృందం విచారించింది. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేసి, సంతకాలు తీసుకుంది. మద్యం కుంభకోణంలో వివిధ అంశాలపై ఆరా తీసిన సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరోసారి మిథున్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశముంది. కోర్టు ఆదేశాలతో న్యాయవాది సమక్షంలోనే సిట్ మిథున్రెడ్డిని విచారించింది.
లిక్కర్ పాలసీ రూపకల్పన, ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర, అదాన్ డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లపై మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డికి చెందిన అదాన్ డిస్టిలరీ, డికార్ట్ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎంతమేర కొనుగోళ్లు చేసిందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరులు చాణక్య రాజ్, అవినాష్ రెడ్డిలతో మిథున్రెడ్డికి ఉన్న సంబంధాలు, ఇతర ఆర్థిక లావాదేవీలపై సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే కొన్ని ప్రశ్నలకు మిథున్ రెడ్డి సమాధానాలు దాటవేసినట్లు సమాచారం.
మద్యం కేసు గురించి ఇప్పుడు పూర్తిగా మాట్లాడలేనని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. సిట్ విచారణ అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇదంతా ఓ కట్టుకథ, గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారన్నారు. గనుల్లో అవకతవకలు జరిగాయన్నారు, ఏ ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదన్నారు. తమ సొంత భూమిని అటవీభూమి అంటూ ఆరోపణలు చేశారని మిథున్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు తమ కుటుంబం ఎన్నో కేసులు పెట్టారని, ఏ ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారన్నారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో ఒక భాగమేనన్నారు. తన బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున, ఈ వ్యవహారంలో ఇంకేమీ మాట్లాడలేనని చెప్పారు.