మంచు మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీకి పెద్ద షాక్ తగిలింది. మోహన్ బాబు యూనివర్సిటీకి భారీగా జరిమానా వేసింది ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడమే కాకుండా.. ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజనల్ సర్టిఫికేట్లను నిలిపివేయడంలాంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉన్నత విద్యా కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది. అయితే ఈ మెుత్తాన్ని యూనివర్సిటీ చెల్లించింది.
2022-23 నుంచి అంటే గత మూడేళ్ల నుంచి విద్యార్థుల దగ్గర ఫీజులు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇవి రూ.26 కోట్లపైన ఉన్నట్టుగా తేల్చారు. ఈ మేరకు యూనివర్సిటీపై విచారణ చేసిన ఉన్నత విద్యా కమిషన్ నిజమేనని నిర్ధారించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26,17,52,872 కూడా తిరిగి చెల్లించాలని కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లకుపైగా సొమ్మును 15 రోజుల్లో వారికి చెల్లించాలని చెప్పింది కమిషన్. అంతేకాదు యూనివర్సిటీ అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీహెచ్పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సెల్కు కమిషన్ సిఫారసు చేసింది.
పేరెంట్స్ అసోసియేషన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నత విద్యా శాఖ అధికారులు విచారణ చేశారు. ఇందులో భాగంగానే మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించే విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో 26 కోట్లకుపైగా అదనంగా వసూలు చేశారని గుర్తించారు.
మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ. 2022లో శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల నుంచి విశ్వవిద్యాలయంగా మారిన విషయం తెలిసిందే.
అయితే మీడియాలో వస్తున్న వార్తలపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు స్పందించారు. మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చేసిన కొన్ని సిఫార్సుల గురించి వివిధ మీడియా మాధ్యమాలలో ప్రచారం అవుతున్న వార్తలను ఉద్దేశించి ప్రకటన విడుదల చేస్తున్నామని తెలిపారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఈ సిఫార్సులను వ్యతిరేకిస్తోందన్నారు. అవి కేవలం సిఫారసులు మాత్రమేనని చెప్పారు.
ఈ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉందని, కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా యూనివర్సిటీకి అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చిందని మంచు విష్ణు వెల్లడించారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి.. దీనిని పోర్టల్లో పెట్టడం దురదృష్టకరమని, ఏపీహెచ్ఈఆర్ఎంసీ చేసిన సిఫారసులు సరికాదని మోహన్ బాబు యూనివర్సిటీ గట్టిగా విశ్వసిస్తోందన్నారు.