Freedom Of Speech :ఉద్యోగులకు ప్రశ్నించే స్వేచ్ఛ లేదా? సర్కారుకు హైకోర్టు ప్రశ్న
Freedom Of Speech వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పు వెలువరించే వరకు ఉద్యోగుల సంఘం వ్యవహారంలో తుది నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఉద్యోగుల సమస్యలపై మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉద్యోగులకు ఉండదా అని ధర్మాసనం నిలదీసింది.
Freedom Of Speech ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సంషోకాజ్ నోటీసుపై దాఖలైన పిటిషన్పై తీర్పు ఇచ్చే వరకు తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగులకు తమ 'సమస్యలపై మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందో లేదో చెప్పాలని నిలదీసింది. ఉద్యోగుల సమస్యలపై పోరాడకూడదా అని ప్రశ్నించిన ధర్మాసనం, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిస్థితేమిటి? ఉద్యోగుల సంఘానికి ఆర్టికల్ 19 వర్తించదా అని ప్రశ్నించింది.
ట్రెండింగ్ వార్తలు
ప్రభుతక్వ ఉద్యోగుల సంఘం మీడియాతో మాట్లాడిన మాటల్లో ప్రభుత్వాన్ని కించ పరిచినట్లు ఎక్కడుందని, ఉద్యోగులు ఏ నిబంధనను ఉల్లంఘించారో షోకాజ్ నోటీసులో ఎందుకు పేర్కొనలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉద్యోగ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని ఇచ్చిన నోటీసులపై సంఘం హైకోర్టును ఆశ్రయించింది.
ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తరపున వైవీ.రవిప్రసాద్, ఉమేష్ చంద్రలు వాదనలు వినిపించారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు మరుసటి నెల 15వ తేదీన చెల్లిస్తున్నారని, ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల నుంచి రూ.413 కోట్ల రుపాయలను ప్రభుత్వం మళ్లించడాన్ని కోర్టుకు వివరించారు.
ఉద్యోగుల జీతాలతో పాటు ఆర్ధిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశామని, గవర్నర్ను కలిసినందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చిందని, ప్రభుత్వంపై ఉద్యోగులు ఎలాంటి ఆరోపణలు చేయలేదని, వివరణ ఇవ్వకపోతే వారంలో గుర్తింపు రద్దు చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారని, ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడనందున ప్రభుత్వ ఉత్తర్వులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. షోకాజ్ నోటీసును సవాలు చేయడానికి వీల్లేదని వివరణ ఇచ్చిన తర్వాత తగిన ఉత్తర్వులు ఇస్తారని పేర్కొన్నారు.
ఏ నిబందన మేరకు షోకాజ్ నోటీసు జారీ చేశారో ఎందుకు పేర్కొనలేదని న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉద్యోగ సంఘం చేసిన వ్యాఖ్యలు ఎక్కడ ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై మీడియాతో మాట్లాడారని , గోప్యంగా ఉంచాల్సిన వాటిని బహిర్గతం చేశారని, వాటిని భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించలేమన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఈ పిటిషన్పై విచారణ జరిపారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేశారు.
టాపిక్