AP High Court On Bigg Boss : బిగ్ బాస్ రెండు ఎపిసోడ్స్ చూస్తాం.. హైకోర్టు కామెంట్స్
AP HIgh Court On Bigg Boss : బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ షోపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. షో రెండు ఎపిసోడ్స్ చూస్తామని వ్యాఖ్యానించింది.
బిగ్ బాస్(Bigg Boss) షో ఎంతో హిట్టో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఆరో సీజన్ నడుస్తోంది. కింగ్ నాగర్జున(Nagarjuna) ఈ షోకు హోస్ట్ గా ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో దీనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అశ్లీలత ఎక్కువైందనే అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా బిగ్ బాస్ విషయం హైకోర్టుకు వెళ్లింది. అశ్లీలత ఎక్కువైందని పిల్ దాఖలైంది. షోను ఆపేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. చట్టం ప్రకారం రాత్రి 11 నుంచి ఉదయం 5 మధ్యలో ప్రసారం చేయాలని పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు(High Court) విచారణ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
బిగ్ బాస్ రియాలిటీ షో(Bigg Boss Show) సెన్సార్ లేకుండా ప్రసారం అవుతోందని, అశ్లీలంగా ఉందని దాఖలైన పిల్ పై చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. బిగ్బాస్ షోకు సంబంధించిన వివరాలను నివేదించాలని ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. రెండు, మూడు ఎపిసోడ్స్(Bigg Boss Episodes) చూస్తి అప్పుడు చెబుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ తర్వాత తీర్పును ప్రకటిస్తామని స్పష్టం చేస్తామని పేర్కొంది. అసలు బిగ్ బాస్ షోలో ఏముందో తెలుసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది కోర్టు.
బిగ్ బాస్ రియాల్టీ షో పై మెుదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. సీపీఐ నేత నారాయణ(CPI Narayana) తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే ఎవరూ పెద్దగ స్పందించక పోవడంతో.. షో సజావుగా నడుస్తోంది. తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి బిగ్ బాస్ షో సీజన్ 6పై ఆరోపణలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం(PIL) దాఖలు చేశారు. దీంతో మరోసారి బిగ్ బాస్ వివాదం తెరపైకి వచ్చింది.
అయితే ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. పిటిషనర్ కేతిరెడ్డి ప్రచారం(Promotion) కోసం ఈ పిటిషన్ వేయలేదు కదా ప్రశ్నలు వేసింది. అదేం లేదంటూ.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. షో ప్రచారం కోసం పిటిషన్ వేశారా అనే కోణాన్ని కూడా పరిశీలన చేస్తామని కోర్టు పేర్కొంది. ప్రచారం కోసం నిర్వాహకులే వివాదాలు సృష్టిస్తున్నారనే వ్యాఖ్యలను హైకోర్టు చేసినట్టుగా తెలుస్తోంది. రెండు ఎపిసోడ్స్ చూశాక చెప్తామని పేర్కొంది.