సోషల్ మీడియా పోస్టుల కేసులు - రిమాండ్ విధింపుపై జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు..!-ap high court issues guidelines to magistrates on social media related arrests and remands ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  సోషల్ మీడియా పోస్టుల కేసులు - రిమాండ్ విధింపుపై జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు..!

సోషల్ మీడియా పోస్టుల కేసులు - రిమాండ్ విధింపుపై జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు..!

సోషల్‌ మీడియా పోస్టింగ్ కేసుల్లో విధించే రిమాండ్లపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. ఎక్కువ మంది జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌లు… నిందితులకు రిమాండ్‌ విధిస్తున్నట్లు హైకోర్టు దృష్టికి వచ్చిందని ప్రస్తావించింది.

ఏపీ హైకోర్టు

రాష్ట్రంలోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ సర్క్యులర్‌ ఇచ్చింది. సోషల్‌మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని ప్రస్తావించింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసుల్లో ఆర్నేష్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ తీర్పును అనుసరించాలని స్పష్టం చేసింది.

మార్గదర్శకాలను పాటించాల్సిందే - హైకోర్టు సర్కులర్

ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై నమోదు చేసే ఎఫ్‌ఐఆర్‌లను అన్ని కోణాల్లో పరిశీలించాలని స్పష్టం చేసింది. రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా..?లేదా…? అనేది క్షుణ్ణంగా చూడాలని పేర్కొంది. మెజిస్ట్రేట్‌లు కచ్చితంగా ఈ సర్క్యులర్‌ ను అమలు చేయాలని ఆదేశించింది.

భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛగా అభిప్రాయాలను చేసే విషయంలో ‘క్రిమినల్‌ లా’ను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ ఏడాది మార్చి 28న ‘ఇమ్రాన్‌ ప్రతాప్‌ గాందీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కీలక ఇచ్చిందని సర్కులర్ లో ప్రస్తావించింది. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లకు సంబంధించిన కేసుల్లో నిందితులకు రిమాండ్‌ విధించే ముందు సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను పరిశీలించాలని పేర్కొంది.

కేసుకు సంబంధించిన అన్ని వివరాలపై సంతృప్తి చెందాకే రిమాండ్‌కు పంపే విషయంలో మెజిస్ట్రేట్లు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు విడుదల చేసిన సర్కులర్ లో ఉంది. సర్క్యులర్‌లోని సూచనలను మెజిస్ట్రేట్లందరూ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. తమ సూచలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు పేర్కొంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.