AP HC On Flexi Ban : ఫ్లెక్సీల నిషేధంలో ప్రభుత్వ జోక్యం తగదన్న హైకోర్టు...
AP HC On Flexi Ban ఏపీలో పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్ల ముద్రణపై నిషేధం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లను ముద్రించడం, వినియోగించడంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిషేధాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ప్రభుత్వం జారీ చేసిన నిషేధం ఉత్తర్వులు పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లకు వర్తించదని స్పష్టం చేసింది. ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, నోటిఫికేషన్లు పర్యావరణ చట్టంలోని సెక్షన్ 5, జీవో నంబర్ 34తో పాటు కేంద్ర ప్రభుత్వం 2021 ఆగష్టు 12న జారీ చేసిన నోటిఫికేషన్కు విరుద్ధంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
AP HC On Flexi Ban ఏపీలో ఫ్లెక్సీ బ్యానర్ల తయారీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పీవీసీ ఫ్లెక్సీల వినియోగంపై నిషేధాన్ని విధించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపే నిర్ణయంపై ఏక పక్షంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్లెక్సీలు పర్యావరణానికి ఏ విధంగా హానీ చేస్తున్నాయో శాస్త్రీయ అధ్యాయనం ఏమైనా చేశారా అని నిలదీశారు. ఫ్లెక్సీ పరిశ్రమపై ఆధారపడిన వ్యాపారులకు నోటీసులు ఇచ్చారా, వారి వివరణలు పరిగణలోకి తీసుకున్నారా అని ప్రశ్నించింది.
ట్రెండింగ్ వార్తలు
ఏపీలో ఫ్లెక్సీల వినియోగం, తయారీపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో పరిశ్రమపై ఆధారపడిన వారు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జీవనోపాధి కోల్పోతున్నామని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి శాస్త్రీయ అధ్యయనమూ చేయకుండా దుందుడుకుగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారని అభిప్రాయ పడింది.
రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల నిషేధాన్ని అమల్లోకి తీసుకురావడంపై ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఫ్లెక్సీ బ్యానర్లు పర్యావరణానికి ఎలా హాని కలిగిస్తున్నాయో శాస్త్రీయ అధ్యయనం చేశారా అని ధర్మాసనం నిలదీసింది. బ్యానర్ల నిషేధానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించలేదని ప్రాథమికంగా నిర్దారించారు.
ఫ్లెక్సీలు, బ్యానర్ల రద్దు ఉత్తర్వులు ఒకసారి వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యానర్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఓవెన్ పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లకు వర్తించవని స్పష్టం చేసింది. వాటి వాడకం విషయంలో ప్రభుత్వం కలుగ చేసుకోవద్దని స్పష్టం చేసింది. జస్టిస్ గంగారావు, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఫిబ్రవరి 22కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఫ్లెక్సీ, బ్యానర్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 65ని సవాల్ చేస్తూ పలువురు వ్యాపారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు.
ముఖ్యమంత్రి హడావుడి నిర్ణయం....
ఫ్లెక్సీ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సీనియర్ న్యాయవాదులు చల్లా కోదండరామ్, గంటా రామారావు వాదనలు వినిపించారు. ‘ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల నిషేధంపై ఎలాంటి అధ్యయనమూ చేయలేదని వాదించారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన ముఖ్యమంత్రి, అప్పటికప్పుడు నిషేధంపై నిర్ణయం తీసుకున్నారని, వ్యాపారులు, కార్మికులకు ప్రత్యామ్నాయం చూపించకుండా ప్రభుత్వం ఫ్లెక్సీ బ్యానర్ల వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించిందని వివరించారు.
పీవీసీ బ్యానర్లను తిరిగి వినియోగించవచ్చని, ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం మానవ జీవితంలో భాగమైందని వాదించారు. రీ యూజ్ చేసే ప్లాస్టిక్ను దేశంలో ఎక్కడా నిషేధించలేదని బ్యానర్లు పీవీసీ ప్లాస్టిక్ నిర్వచనం కిందికి రావన్నారు. పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లను నిషేధించడం వల్ల వేలాదిమంది కార్మికులు రోడ్డున పడతారన్నారు. పిటిషనర్ల వాదనలతో రాష్ట్ర ప్రభుత్వం విభేదించింది. పర్యావరణ కాలుష్యం ఏర్పడుతున్నందు వల్లే నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.
టాపిక్