ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ సంస్థ ఒరాకిల్ తో ఏపీఎస్ఎస్డీసీ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్ స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది.
మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువత ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మూడేళ్లలో మొత్తం 4 లక్షల మందికి ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా శిక్షణ అందిస్తారన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ష్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందుపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం అన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి మార్చి, 2027వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఎన్ఏసీ శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్ ల ఏర్పాటు ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9 వేల మంది యువతకు శిక్షణ అందిస్తారని మంత్రి లోకేశ్ తెలిపారు.
ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్ 61వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున సామాన్యులు తరలివచ్చారన్నారు.
"శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీలో పనిచేస్తుండగా తన భర్త విద్యుత్ షాక్ కు గురై మరణించాడని, ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని చిలకపాలెంకు చెందిన డి.రేవతి విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో తమ 0.34 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామానికి చెందిన పడాల రాములు కోరారు.
బీఎస్సీ నర్సింగ్ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఒంగోలుకు చెందిన మౌనిక విజ్ఞప్తి చేశారు. తన కుమారుడికి దివ్యాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని విజయవాడ పోరంకికి చెందిన ఐ.వరప్రసాద్ విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చాను" -నారా లోకేశ్
సంబంధిత కథనం