విశాఖ స్టీల్ ప్లాంట్ గాడినపడుతోంది.. బలోపేతానికి పూర్తిగా సహకారం అందిస్తాం : సీఎం చంద్రబాబు-ap govt remains committed to strengthening protecting visakhapatnam steel plant says cm chandrababu naidu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విశాఖ స్టీల్ ప్లాంట్ గాడినపడుతోంది.. బలోపేతానికి పూర్తిగా సహకారం అందిస్తాం : సీఎం చంద్రబాబు

విశాఖ స్టీల్ ప్లాంట్ గాడినపడుతోంది.. బలోపేతానికి పూర్తిగా సహకారం అందిస్తాం : సీఎం చంద్రబాబు

Anand Sai HT Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏడాది కాలంలో కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉత్పత్తిలో పురోగతి వచ్చిందన్నారు.

సీఎం చంద్రబాబు

విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయడంతో పాటు గరిష్ట ఉత్పత్తి స్థాయికి తీసుకువెళ్లే అంశంపై సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంలో తీసుకున్న చర్యలను, వచ్చిన ఫలితాలపై మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి, రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడాది కాలంగా కేంద్రం మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉక్కు కర్మాగారం ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించామని, ఇది స్వాగతించదగిన పరిణామమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపిందని చంద్రబాబు వెల్లడించారు. రూ.11,440 కోట్ల కేంద్ర సహాయాన్ని గుర్తు చేశారు. కేంద్రంతో సమన్వయంతో ప్రయత్నాల ద్వారా FY26 నాటికి సామర్థ్య వినియోగం 92.5 శాతానికి చేరుకోవాలన్నారు.

గత సంవత్సరంలో తీసుకున్న చర్యలు, సాధించిన ఫలితాలపై అధికారులతో మాట్లాడారు చంద్రబాబు. ప్లాంట్‌ను నష్టాల నుండి బయటపడేయడానికి, దానిని మరింత బలోపేతం చేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి పనిచేయడం కొనసాగించాలన్నారు.

కూటమి ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా కేంద్రం ప్లాంట్‌కు రూ. 11,440 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఇందులో ఎక్కువ భాగం కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, ప్లాంట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి కేటాయించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్లాంట్ సామర్థ్యంలో 25 శాతం నుంచి ఈ సెప్టెంబర్ నాటికి అది 79 శాతానికి చేరుకుంది.

ఇది చాలా సానుకూల పరిణామంగా అభివర్ణిస్తూ, మరింత ముందుకు సాగాలని చంద్రబాబు స్టీల్ ప్లాంట్ అధికారులను ఆదేశించారు. 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరి నాటికి, ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 92.5 శాతానికి చేరుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని వాటాదారులు ఐక్యంగా పనిచేయాలన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.