దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఏపీ సర్కార్ ప్రారంభించనుంది. ఈ పథకం అమలుకు ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై మరో కీలక అడుగు పడింది. ఈ పథకానికి ప్రభుత్వం నిధులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌరసరఫరాల జాయింట్ అకౌంట్ కు రూ.895 కోట్లు విడుదల చేసింది. పట్టణ ప్రజలకు 24 గంటల్లో, గ్రామీణ ప్రాంత ప్రజలకు 48 గంటల్లో డీబీటీ విధానంలో లబ్దిదారులు అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం అమలుకు రూ.2684 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ నెల 29 నుంచి లబ్దిదారులు ఉచిత సిలిండర్ కోసం బుక్ చేసుకోవచ్చు. ఈ పథకానికి ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలని ప్రభుత్వం ప్రకటించింది. సిలిండర్ బుక్ చేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. లబ్దిదారులు ముందుగా సిలిండర్ కు నగదు చెల్లించి తీసుకుంటారు. సిలిండర్ పొందిన 24 గంటల నుంచి 48 గంటల మధ్య లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డులను ప్రాతిపదికగా తీసుకొని వంటగ్యాస్ సిలిండర్ రాయితీ ఇస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాయితీ సొమ్మును బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వైట్ రేషన్ కార్డుల సమాచారం వంట గ్యాస్ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉంటేగాని బుకింగ్ సాధ్యపడదు. ప్రస్తుతం వంటగ్యాస్ ఆన్లైన్లో బుక్ చేస్తున్నప్పటికీ.. ఆధార్, ఫోన్ నెంబర్ ఆధారంగా బుకింగ్ అవుతోంది. రాయితీ పొందాలంటే రేషన్ కార్డు వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఎలా పొందు పర్చాలనే విషయంపై స్పష్టత లేదు.
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ఈకేవైసీకి దూరంగా 20 లక్షల వినియోగదారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది ఉండగా.. అందులో నేటికీ సుమారు 20 లక్షలపైగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1,100 డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ ద్వారా 1.55 కోట్ల మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతున్నాయి. అందులో 1.47 కోట్లు మంది వైట్ రేషన్ కార్డుల వినియోగదారులు ఉన్నారు. అందులో కేవలం 9.65 లక్షల గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం వర్తింస్తుంది. తెల్ల రేషన్ కార్డు లేనివారిలో కూడా పేదలు ఉన్నప్పటికీ.. వారు ఉచిత గ్యాస్ పథకానికి అనర్హలుగా ఉన్నారు.
సంబంధిత కథనం