ఏపీలో కాలేజీల ఫీజు బకాయిలు విడుదల కాకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవటం… మరోవైపు ప్రైవేటు కాలేజీల నుంచి ఒత్తిడి ఉండటంతో విద్యార్థులు సతమతవుతూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా…. ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేసింది.
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.600 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు.
ఫీజుల కోసం విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేయవద్దని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిందని కోన శశిధర్ గుర్తు చేశారు. విద్యార్థుల్ని తరగతులకు హాజరుకాకుండా నిరోధించడంతో పాటుగా హాల్ టికెట్లు నిలిపివేయడం, పరీక్షలు రాయనీయకుండా అడ్డుపడడం వంటి చర్యలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయంలో మార్చి 12వ తేదీ ప్రకటన ఇచ్చామని తెలిపారు. ఈ విషయంలో అన్ని వర్శిటీల వీసీలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల తల్లుల అకౌంట్లో రియంబర్స్ మెంట్ నిధులను జమ చేశారు. ఈ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. ప్రస్తుతం కాలేజీల ఖాతాలోకే నిధులను జమ చేస్తున్నారు.
ఫీజు రియింబర్స్మెంట్లో భాగంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ క్రమంలో గత విద్యా సంవత్సరం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థుల్ని మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించాలంటే ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలు రాయనిస్తామని కాలేజీలు తేల్చి చెప్పడంతో గత ఏడాది జూన్లోనే కొందరు విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఫీజు బకాయిలు చెల్లించడానికి కూటమి ప్రభుత్వానికి కొంత సమయం కావాలని, బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కొన్ని కాలేజీలు వేచి చూశాయి.
204-25 సంవత్సరానికి సంబంధించిన ఫీజుల్ని కాలేజీలకు నేరుగా చెల్లిస్తోంది. 2023-24 సంవత్సరాలకు సంబంధించిన బకాయిలు అందకపోవడంతో కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతూ వచ్చాయి. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని… ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో విద్యార్థులకు కాస్త ఉపశమనం దొరికినట్లు అయింది. మిగతా నిధులు కూడా త్వరలోనే విడుదలయ్యే అకాశం ఉంది.