Cyclone Mandous Victims : తుపాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల.. ఎంతంటే?
Cyclone Mandous Update : మాండూస్ తుపాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మాండూస్ తుపాను(Mandous Cyclone) బాధితులకు ఏపీ ప్రభుత్వం(AP Govt) సాయాన్ని విడుదల చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. వ్యక్తికి రూ.1000, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేప్పుడు ఈ ఆర్థిక సాయం అందుకోనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు(Nellore), తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సాఅర్ జిల్లాల్లోని బాధితులకు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం చెప్పింది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు ఎలాంటి నష్టం జరగుకుండా తుపానుపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మాండూస్(Mandous) తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందు నుంచి ప్రత్యేక చర్యలను తీసుకుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు ప్రతిరోజు సమీక్షలు నిర్వహించి అధికారులకు తుపాను ముప్పును తగ్గించడానికి అమలు చేయాల్సిన విధివిధానాలు గురించి ఆదేశాలు జారీ చేశారని వివరించారు. అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి విపత్తుల సంస్థలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుపాను కదలికల్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు.
తుపాను సమయంలో విపత్తుల సంస్థ యంత్రాంగం 24 గంటలు నిరంతరం పనిచేస్తూ సత్వరం స్పందించారని అధికారులు చెప్పారు. దీంతో ముప్పును స్పష్టంగా అంచనా వేయడంతో పాటు ప్రభుత్వం(Govt) తీసుకున్న చర్యల వలన నష్ట తీవ్రతను తగ్గించగలిగామని తెలిపారు. తుపాను సమయంలో సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపించామన్నారు. భారీ వర్షాలు(Heavy Rains), ఈదుర గాలులు నేపధ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలెర్ట్ ద్వారా ఆరు జిల్లాల్లోని సుమారు కోటిమందికి ముందుగానే తుపాను హెచ్చరిక సందేశాలు పంపినట్లు వివరించారు.
ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్రతను చూపిందని అధికారులు తెలిపారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు చెప్పారు. 33 సహాయ శిబిరాలని ఏర్పాటు చేసామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. సహాయక చర్యలకోసం ప్రకాశం-2, నెల్లూరు-3, తిరుపతి-2, చిత్తూరుకు-2 మొత్తంగా 5ఎన్డీఆర్ఎఫ్(NDRF), 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని తెలియజేశారు.