ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నుంచి రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీ ధరకు కందిపప్పు, రాగులు పంపిణీ చేయనుంది.
పేదలందరికీ పోషకాహారం, ఆర్థిక సౌలభ్యం అందించేందుకు రేషన్ దుకాణాల్లో ద్వారా బియ్యంతో పాటు ఇతర సరుకులు అందించేందుకు చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం ఏపీలో రేషన్ కార్డుదారులకు నెలకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తోంది. నలుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా 20 కిలోల వరకు బియ్యం అందిస్తున్నారు. ఉచిత బియ్యంతో పాటు ఒక కిలో పంచదార రూ.20 అందిస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తుంది.
జూన్ 2025 నుంచి రేషన్ షాపుల్లో బియ్యం, పంచదారతో పాటు సబ్సిడీపై కందిపప్పు(కిలో ధర రూ.67) , రాగులు ఉచితంగా అందించనున్నారు. ప్రతి కార్డుదారుడికి ఒక కిలో కందిపప్పు, రెండు కిలోల రాగులు పంపిణీ చేయనున్నారు. కందిపప్పు, రాగులను పోషకాహార పథకం ద్వారా పేద ప్రజలకు అందించనున్నారు. రాగుల ఉత్పత్తిని పెంచేందుకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు.
రాబోయే మూడు నెలలకు సరిపడా కందిపప్పును, ఏడాదికి సరిపడిన రాగులను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
రేషన్కార్డుదారులతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ లబ్ధిదారులకు జూన్, జులై, ఆగస్టు నెలలకు సరిపడేలా రూ.500 కోట్ల విలువైన 47,037 టన్నుల కందిపప్పు, రూ.100 కోట్లకు పైగా విలువైన 25 వేల టన్నుల రాగులు, 43,860 టన్నుల పంచదార సేకరణకు ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో ఎన్ఈఎంఏల్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఏపీలో 1.46 కోట్లకుపైగా రేషన్కార్డుదారులు ఉన్నారు. రేషన్ షాపుల ద్వారా అందించే ఉచిత బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా పొందే అవకాశం కల్పించనున్నారు. ప్రతి నెలా 20 కిలోల రేషన్ బియ్యం తీసుకునే కుటుంబం రెండు కిలోల రాగులను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తే, ఆ మేరకు బియ్యం కోటాను తగ్గిస్తారు.
ఈ పథకం అమలుకు ఏడాదికి సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరం అవుతాయని సివిల్ సప్లై అధికారులు అంచనా వేస్తున్నారు.
రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ-కేవైసీ చేయకపోతే రేషన్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉందని రేషన్ డీలర్లు అంటున్నారు. మే నెల నుంచి రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు చేయనున్నారు. ఏటీఎం సైజులో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.
సంబంధిత కథనం