రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్- జూన్ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ-ap govt good news for ration card holders distribution of toor dal ragulu from june month ration ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్- జూన్ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్- జూన్ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు తీపికబురు చెప్పింది. జూన్ నెల నుంచి రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, రాగులు పంపిణీ చేయనుంది. సబ్సిడీపై కందిపప్పు, ఉచిత బియ్యం స్థానంలో రాగులు పొందే సౌలభ్యం కల్పించనుంది.

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్- జూన్ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నుంచి రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీ ధరకు కందిపప్పు, రాగులు పంపిణీ చేయనుంది.

పేదలందరికీ పోషకాహారం, ఆర్థిక సౌలభ్యం అందించేందుకు రేషన్ దుకాణాల్లో ద్వారా బియ్యంతో పాటు ఇతర సరుకులు అందించేందుకు చర్యలు చేపట్టింది.

ఉచిత బియ్యం, పంచదార

ప్రస్తుతం ఏపీలో రేషన్ కార్డుదారులకు నెలకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తోంది. నలుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా 20 కిలోల వరకు బియ్యం అందిస్తున్నారు. ఉచిత బియ్యంతో పాటు ఒక కిలో పంచదార రూ.20 అందిస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తుంది.

పోషకాహార పథకంలో

జూన్ 2025 నుంచి రేషన్ షాపుల్లో బియ్యం, పంచదారతో పాటు సబ్సిడీపై కందిపప్పు(కిలో ధర రూ.67) , రాగులు ఉచితంగా అందించనున్నారు. ప్రతి కార్డుదారుడికి ఒక కిలో కందిపప్పు, రెండు కిలోల రాగులు పంపిణీ చేయనున్నారు. కందిపప్పు, రాగులను పోషకాహార పథకం ద్వారా పేద ప్రజలకు అందించనున్నారు. రాగుల ఉత్పత్తిని పెంచేందుకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు.

కందిపప్పు, రాగుల సేకరణకు టెండర్లు

రాబోయే మూడు నెలలకు సరిపడా కందిపప్పును, ఏడాదికి సరిపడిన రాగులను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.

రేషన్‌కార్డుదారులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్‌ లబ్ధిదారులకు జూన్‌, జులై, ఆగస్టు నెలలకు సరిపడేలా రూ.500 కోట్ల విలువైన 47,037 టన్నుల కందిపప్పు, రూ.100 కోట్లకు పైగా విలువైన 25 వేల టన్నుల రాగులు, 43,860 టన్నుల పంచదార సేకరణకు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో ఎన్‌ఈఎంఏల్‌ పోర్టల్‌ ద్వారా టెండర్లు ఆహ్వానించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

బియ్యానికి బదులుగా రాగులు

ఏపీలో 1.46 కోట్లకుపైగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. రేషన్ షాపుల ద్వారా అందించే ఉచిత బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా పొందే అవకాశం కల్పించనున్నారు. ప్రతి నెలా 20 కిలోల రేషన్ బియ్యం తీసుకునే కుటుంబం రెండు కిలోల రాగులను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తే, ఆ మేరకు బియ్యం కోటాను తగ్గిస్తారు.

ఈ పథకం అమలుకు ఏడాదికి సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరం అవుతాయని సివిల్ సప్లై అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏప్రిల్ 30తో ముగియనున్న ఈ-కేవైసీ గడువు

రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ-కేవైసీ చేయకపోతే రేషన్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉందని రేషన్ డీలర్లు అంటున్నారు. మే నెల నుంచి రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు చేయనున్నారు. ఏటీఎం సైజులో క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం