ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రవాణా, పరిశ్రమలు, సేవా, వ్యాపార రంగాలలో స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తుంది. ఈ పథకం ద్వారా మైనారిటీలు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం పొందవచ్చు.
మైనారిటీల స్వయం ఉపాధి రుణాలు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను మైనారిటీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ పథకం కోసం రూ.173.57 కోట్లు కేటాయించింది. ఈ నిధులను మైనారిటీ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అందించనున్నారు.
ఫ్యాషన్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, కార్పెంటరీ వంటి వాటిలో నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు. ఈ నెల 25 నుంచి దరఖాస్తులు ప్రారంభించారు. మే 25 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుందని మంత్రి ఎన్.ఎండీ. ఫరూక్ తెలిపారు.
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, రవాణా, పరిశ్రమలు, సేవా, వ్యాపార రంగాలలో స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీపై రుణాలు అందిస్తారు.
ఈ పథకంలో లబ్ధిదారులకు యూనిట్ ఏర్పాటు చేసుకోడానికి అయ్యే ఖర్చును బ్యాంక్ ముందుగా విడుదల చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీని మాత్రం బ్యాంక్ లో టర్మ్ డిపాజిట్ రూపంలో ఉంచుతారు. యూనిట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ చేస్తారు.
థర్డ్ పార్టీ ద్వారా రెండు సార్లు తనిఖీ చేస్తారు. యూనిట్ మొదలు పెట్టిన రెండేళ్ల అనంతరం మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు మరోసారి తనిఖీ చేస్తారు. అప్పుడు లబ్ధిదారుడు బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ డబ్బును సరిగ్గా కడుతున్నాడా? లేదా? అని చూస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే రాయితీ నగదును అతని లోన్ ఖాతాకు జమ చేస్తారు.
సంబంధిత కథనం