ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్ల మార్పు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ అంశంపై అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. పేరు మార్పుపై మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. ప్రజల నుంచి వచ్చే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం పేరు మార్పు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఏడుగురు మంత్రులు ఉన్నారు. అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ లిస్టులోని మంత్రులు. ఈ మంత్రివర్గ ఉపసంఘానికి కన్వీనర్గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తార. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయిలో తిరగనుంది. జిల్లా, వెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంత చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం కూడా చూస్తారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. ఈ ఉపసంఘంలోని మంత్రులు పరిపాలనా సౌలక్ష్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని ప్రభుత్వం తెలిపింది.
జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని ప్రభుత్వం ఉపసంఘానికి ఆదేశించింది. ఈ మేరకు మంత్రులు.. సరిహద్దులు, పేర్లు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారు.