AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎంఐలో ఈ–స్కూటర్లు-ap govt electric vehicle scheme 2022 for government employees with emi option ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Govt Electric Vehicle Scheme 2022 For Government Employees With Emi Option

AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎంఐలో ఈ–స్కూటర్లు

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 10:25 AM IST

ap govt electric vehicle scheme 2022: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. ఈఎంఐ పద్ధతిలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’
ఏపీ ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’

e - scooters for ap govt employees: రాష్ట్ర పరిధిలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(ఈ–స్కూటర్‌)లను వాయిదాల పద్ధతిలో అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్‌ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.

ట్రెండింగ్ వార్తలు

ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు. నానాటికీ పెరుగుతున్న పెట్రోలు ధరలతో సామాన్య, మధ్య తరగతి వేతన జీవులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు వాహన కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ–స్కూటర్లు అందించే దిశగా అడుగులు వేసింది.

డౌన్ పేమెంట్ లేదు...

ఈ స్కీమ్ ఎలాంటి డౌన్‌ పేమెంట్‌ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు ఏపీ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు పంపింది. ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసే వారికి రాయితీలు కూడా ఉంటాయని తెలిపింది. ఒక్కో కిలోవాట్‌ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి దీనివల్ల ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది.

ఇక ఈఎంఐలు చెల్లించేందుకు గరిష్టంగానే సమయం ఇవ్వనున్నారు. 24–60 నెలల్లో వాయిదాలను కట్టే ఛాన్స్ ఇవ్వనున్నారు, కనీసం నెలకు రూ.2,500 చెల్లించేలా వెసులుబాటు ఇస్తారు. ఈ పథకం కింద ప్రభుత్వోద్యోగులకు రుణాలు అందించేందుకు ధనలక్ష్మి బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో నెడ్‌కాప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. వడ్డీరేటు 9 శాతంగా ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ విషయంలో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఆసక్తిగల ఉద్యోగులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే... సంబంధిత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఎలక్ట్రానిక్ వాహనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో... ఛార్జింగ్ స్టేషన్లపై కూడా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 109 ఛార్జింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. దీనికితోటు మరో 4వేల ప్రాంతాలను గుర్తించింది. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ స్థలాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఆయాచోట్ల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 300 ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాలను నెలకొల్పే అవకాశం ఉంది.

IPL_Entry_Point