Potti Sriramulu Death Anniversary : పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, జీవో జారీ
Potti Sriramulu Death Anniversary : పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం నాడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 15న అధికారికంగా ఆత్మార్పణ దినం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేస్తూ జీవో నెంబర్ 99ను విడుదల చేశారు. డిసెంబరు 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం నాడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఆదేశాల్లో పేర్కొన్న అంశాలు
1. ప్రతి సంవత్సరం మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరుపుకోవాలని 2018 మార్చి 20న జీవోఎంఎస్ నెంబర్ 67ను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి భాషాప్రయుక్త రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన పొట్టిశ్రీరాములు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ పొట్టి శ్రీరాములు వర్ధంతి ప్రతి సంవత్సరం డిసెంబర్ 15న రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2. 2019 ఫిబ్రవరి 14న జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 21 ఉత్తర్వులకు కొనసాగింపుగా, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన ఆత్మార్పణ దినంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
3. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లోని అన్ని శాఖలు, విభాగాధిపతులు, కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు ప్రతి సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా సముచితంగా పాటించాలి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి.
4. ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, పాఠశాలలు / కళాశాలల్లో విద్యార్థుల కోసం పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర, విశేషాలపై వ్యాస రచన, క్విజ్, వక్తృత్వ పోటీలను నిర్వహించాలి.
దీంతో వచ్చే ఆదివారం రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహించనున్నారు. అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వచ్చే వారంలో విద్యా సంస్థలు, పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులకు పొట్టి శ్రీరాములు జీవితంపై వ్యాస రచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నాయి. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములను గౌరవించుకోవడం మనందరి బాధ్యతని, అందులో భాగంగానే ప్రభుత్వం అధికారికంగా పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుగు భాషా పండితులు తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం