వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈలోపు జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా తయారు చేయాలని.. పాఠశాల విద్యా శాఖ అన్ని జిల్లాల అధికారులను ఇప్పటికే ఆదేశించింది. అందులో భాగంగానే అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులు స్కూల్ అసిస్టెంట్ల ఉపాధ్యాయ సీనియారిటీ జాబితా తయారు చేశారు. వాటిని జిల్లా స్థాయిల్లోనే విడుదల చేశారు. తాజాగా ఎస్జీటీ సీనియారిటీ జాబితాను విడుదల చేశారు.
టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టీఐఎస్) ద్వారా ఉపాధ్యాయులు వ్యక్తిగత, సర్వీసుకు సంబంధించిన సమగ్ర వివరాల ఆధారంగా జాబితాను తయారు చేశారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక, నగరపాలక పాఠశాల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను తయారు చేశారు. వీటిని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో), రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) కార్యాలయ వెబ్సైట్లతో పాటు, నోటీసు బోర్డులలో అందుబాటులో ఉంచారు.
ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 11 తేదీలోపు డీఈవో, ఆర్జేడీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాల్సి ఉంటుంది. అభ్యంతరం తెలిపే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, హోదా, సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనడంతో పాటు.. సంబంధిత ఆధారాలు జత చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక వచ్చే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోరు. గడువులోపు వచ్చిన అభ్యంతరాలను ఫిర్యాదుల కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.
స్కూల్ అసిస్టెంట్ల సీనియరిటీ జాబితాలో తప్పులు తడకలగా ఉండటంతో.. రెండుసార్లు తయారు చేయాల్సి వచ్చింది. తొలిత ఫిబ్రవరి 20న అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. ఆయా జాబితాల్లో తప్పులు తడకలుగా ఉండటంతో ఉపాధ్యాయులు, సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. దీంతో రాష్ట్ర స్థాయిలో విద్యా శాఖ కమిషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సీనియారిటీ జాబితాల్లో తప్పులను సరిదిద్దాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. తప్పులను సరిదిద్ది మళ్లీ జాబితాను విడుదల చేయాలని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారి (డీఈవో), రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ఆదేశాలు ఇచ్చారు.
విద్యా శాఖ అధికారులు మళ్లీ సీనియారిటీ జాబితాను తయారు చేసి.. మార్చి 20న రెండోసారి విడుదల చేశారు. అందులోనూ తప్పులు ఉండటంతో మళ్లీ తయారు చేయాల్సి వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ తుది జాబితాను కూడా, ఎస్టీటీల జాబితాతోనే విడుదల చేశారు. 1989 సంవత్సరం డీఎస్సీ నుంచి 2018 సంవత్సరం డీఎస్సీ వరకు కేడర్ వారీగా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. ఉపాధ్యాయుల నుంచి వారి విద్యార్హత, డీఎస్సీ పోటీ పరీక్షలో లభించిన మార్కులు తదితర వివరాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
రాష్ట్రంలో 44 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1.80 లక్షల మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు. వీరికి బదిలీలు, పదోన్నతలు గత కొంత కాలంగా ఆగిపోయాయి. వాటిని ఈ వేసవి సెలవుల్లోనే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ జాబితాలను తయారు చేసి విద్యా శాఖ విడుదల చేసింది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం