సినిమా టికెట్ల రేట్లు ఖరారుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల ఖరారుపై కమిటీని నియమించింది. హైకోర్టు ఆదేశాలతో కమిటీ ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో 5 మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేయనుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా సమాచార, ఆర్థిక శాఖ, న్యాయ శాఖల కార్యదర్శులు, సినీ నిర్మాత వివేక్ కుచిభట్ల ఉంటారు.
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన పలు సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం వల్ల శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ధరల పెంపుపై కమిటీ వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు భారీగా తగ్గించారు. సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు టికెట్ల రేట్లు భారీగా తగ్గించామని చెప్పారు. అయితే సినీ పరిశ్రమ లక్ష్యంగా టికెట్ల రేట్లు తగించారని విమర్శలు సైతం వచ్చాయి. సినీ ప్రముఖులు అప్పటి సీఎం...జగన్ ను కలిసి సినిమా టికెట్లపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇది అప్పట్లో పెద్దదుమారం రేపింది.
వైసీపీ ప్రభుత్వం కొందరిని లక్ష్యంగా చేసుకుని రేట్లు తగ్గించడం, అధికారులను రంగంలోకి దింపి సినిమా థియేటర్ల వద్ద తనిఖీలు చేయడం అప్పట్లో వివాదానికి దారి తీసింది. గత ఎన్నికల్లో వైసీపీ పరాభవానికి సినీ పరిశ్రమతో విభేధాలు ఒక కారణంలో విశ్లేషకులు చెబుతుంటారు. అయితే పెద్ద సినిమాలకు ఇష్టారీతిన టికెట్ల ధరలు పెంచడం కూడా సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇకపై సినిమా టికెట్ల రేట్లు నిర్ణయించనున్నారు.
సంబంధిత కథనం