ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బార్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా తగ్గించింది. బార్ల లైసెన్స్ ఫీజును ఏడాదికి రూ.5 లక్షలుగా నిర్ణయించింది. అలాగే 3 స్టార్, ఆపై స్థాయి హోటళ్లలో బార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం తగ్గించింది.
పర్యాటకం, ఆతిథ్య రంగానికి ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 3 స్టార్, ఆపైస్థాయి హోటళ్లలో రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించింది. నాన్ రిఫండబుల్ ఛార్జీని రూ.20 లక్షలుగా నిర్ణయించింది. లైసెన్స్ ఫీజులు తగ్గించాలన్న హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
స్టార్ హోటళ్లు ఉన్నచోట బార్ లైసెన్స్ల జారీపై ఎలాంటి నియంత్రణ లేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. లైసెన్స్ ల ఛార్జీలు, ఫీజులపై ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబరు 1 నుంచి తాజా ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు.
ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయి. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. గతంలో ప్రభుత్వం నిర్వహించిన మద్యం విధానాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. దీంతో పాటు పలు బ్రాండ్ల మద్యం ధరలను తగ్గించి, నాణ్యమైన మద్యం సరఫరాపై దృష్టి పెట్టింది. దీంతో లిక్కర్ సేల్స్ పెరిగాయి.
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యానికి ఎక్సైజ్ శాఖ చెక్ పెట్టింది. దీంతో మద్యం అమ్మకాలు పెరగడానికి దోహదపడింది. లిక్కర్ అమ్మకాలు రూ.30 వేల కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు సమాచారం.
2024-25లో సగటున రోజుకు రూ.83.38 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం లిక్కర్ ధర తగ్గించడంతో అమ్మకాలు పెరిగిన, రాబడి పెద్దగా పెరగలేదు. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 9.1 శాతం పెరుగుదల కనిపిస్తుంది.
సంబంధిత కథనం