ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్న రైతులకు 50 వేల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కనెక్షన్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిస్కంలను ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.450 కోట్లు ఖర్చు చేస్తుంది. గత ప్రభుత్వంలో పెండింగ్ దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా కొత్త కనెక్షన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త కనెక్షన్లకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ సామాగ్రి డిస్కంలు సమకూర్చుకుంటున్నాయి.
రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత ప్రభుత్వ సమయంలో రైతులు కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం చేసుకున్నదరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించింది. కొత్త విద్యుత్ కనెక్షన్లను అవసరమయ్యే ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, స్తంభాలు, ఇతర సామాగ్రిని డిస్కంలు సిద్ధం చేస్తున్నాయి. ఒక 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ తో ముగ్గురు రైతులకు కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కో కనెక్షన్కు సగటున ఐదు స్తంభాలు అవసరం అవుతాయి. అందులో మూడు స్తంభాలు, పరికరాలను డిస్కంలు ఉచితంగా అందిస్తాయి. అదనంగా పరికరాల ఖర్చును రైతులు భరించాల్సి ఉంటుంది.
ప్రతి విద్యుత్ కనెక్షన్కు సగటున రూ.85,000 ఖర్చు అవుతుందని ప్రభుత్వ అంచనా. ప్రతి రైతుకు ట్రాన్స్ఫార్మర్ అవసరమైన ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఖర్చు రూ.2.5 లక్షలు వరకు ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యుత్ కనెక్షన్లతో బోరింగులు నడిపేందుకు, సాగు విస్తృతంగా చేసేందుకు అవకాశం లభించనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో చాలా మంది రైతులు ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న విద్యుత్ కనెక్షన్లను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రతి రైతుకు 5 హార్స్పవర్ మోటారును ఉపయోగించేలా విద్యుత్ కనెక్షన్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.
అయితే గతంలో దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం ఈ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం డిస్కంలకు అనుమతులు ఇచ్చింది. 85 వేల ఖర్చుతో ప్రతి రైతుకు ఉచిత విద్యుత్ కనెక్షన్ అందించింది.
సంబంధిత కథనం